మియాపూర్, మార్చి 13 : శేరిలింగంపల్లి జోన్లో ఆస్తి పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రూ.325 కోట్ల మేర ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని జోన్ చేరుకున్నది. తద్వారా వంద శాతం లక్ష్య సాధనకు చేరువులో ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 15 రోజులలో ముగియనున్నందున మిగిలిన కొద్ది మేర ఆస్తి పన్ను వసూళ్లను పూర్తి స్థాయిలో చేపట్టాలని జోనల్ స్థాయి అధికారులు సర్కిళ్ల డీసీలు సహా రెవెన్యూ విభాగం అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రతి నిత్యం సెల్ కాన్ఫరెన్స్ల ద్వారా వాటి పురోగతిపై సమీక్షిస్తున్నారు. వసూళ్లలో వెనుకబడ్డ ప్రాంతాల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ.. సమస్యలను తెలుసుకుంటూ అధిగమించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరపు లక్ష్యంలో 90 శాతానికి పైగా చేరుకోగా.. గడువులోలా లక్ష్యాన్ని పూర్తి చేసేలా సర్కిళ్లలో రెవెన్యూ విభాగం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. డీసీల పర్యవేక్షణలో ఏఎంసీలు, టీఐలు, బీసీలు నిత్యం క్షేత్రస్థాతయిలో పర్యటిస్తూ పన్ను వసూళ్లను చేపడుతున్నారు. మరో 15 రోజులలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో జోన్లో ఇంకా రూ 67 కోట్ల మేర ఆస్తిపన్ను వసూళ్లను చేపట్టాల్సి ఉన్నది.
రోజువారీ సమీక్షలు..సెల్ కాన్ఫరెన్స్లు..
శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.393 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లకు గాను ఇప్పటికే రూ.325 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. మరో రూ.67 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నది. శేరిలింగంపల్లి , చందానగర్, యూసుఫ్గూడ, ఆర్సీపూర్ పటాన్చెరు సర్కిళ్లలో అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్ నుంచి రూ. 245 కోట్లకు గాను ఇప్పటికే రూ.206 కోట్లు, చందానగర్ సర్కిల్లో రూ. 103 కోట్లకు గాను రూ 84 కోట్లు, యూసుఫ్గూడ సర్కిల్లో రూ. 33 కోట్లకు గాను రూ.26 కోట్లు, ఆర్సీపూర్పటాన్చెరు సర్కిల్లో రూ.12 కోట్లకు గాను రూ.11.05 కోట్ల వసూళ్లను పూర్తి చేశారు. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల నుంచి మిగిలిన మొత్తాలు వసూలైతే జోన్ వంద శాతానికి మరింత చేరువకు వస్తుంది.
కాగా మిగిలిన 15 రోజుల నేపథ్యంలో జోన్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో వసూళ్ల ప్రక్రియను పరిశీలించటంతో పాటు ఆయా సర్కిళ్ల డీసీలు, రెవెన్యూ విభాగంతో రోజువారీ పురోగతిపై సెలా కాన్ఫరెన్స్లను నిర్వహిస్తున్నారు. డాకెట్ వారీగా పురోగతిని తెలుసుకుంటూ మందకొడిగా ఉన్న డాకెట్ టీఐలు, బీసీలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వేగం పెంచాలని సూచించారు. కాగా జోన్ వ్యాప్తంగా వాణిజ్య, గృహ విభాగానికి చెంది 2.83 లక్షల వరకు అసెస్మెంట్లుండగా.. వాటి నుంచి జోన్కు ఆస్తి పన్ను జమ అవుతున్నది. శేరిలింగంపల్లి సర్కిల్లో ఐటీ పరిశ్రమలు, సహా భారీ హోటళ్లు, వాణిజ్య సంస్థలున్నాయి. ప్రస్తుతం నమోదైన ఆస్థిపన్ను వసూళ్లు బల్దియాలోనూ తగు గుర్తింపును పొందాయి. వంద శాతం లక్ష్యాన్ని సాధించటం ద్వారా శేరిలింగంపల్లి ఐటీ జోన్ తనదైన ముద్రను వేయాలని భావిస్తున్నది.
ముమ్మరంగా ఆస్తి పన్ను వసూళ్లు..
శేరిలింగంపల్లి జోన్లో ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటికే రూ.325 కోట్ల మేర పన్ను వసూళ్లను నమోదు చేశాం. వంద శాతం లక్ష్యసాధనకు మరో రూ. 67 కోట్లన వసూళ్లను చేపట్టాల్సి ఉన్నది. పూర్తి లక్ష్యం చేరుకోవాలని సర్కిళ్ల డీసీలు, రెవిన్యూ విభాగాన్ని ఆదేశిస్తున్నాం. పన్ను వసూళ్ల పురోగతిపై రోజువారీ సమీక్షలు చేపడుతున్నాం. ఆకస్మిక పరిశీలనల ద్వారా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండేలా కృషి చేస్తున్నాం. గృహ, వాణిజ్య నిర్వహకులు సైతం తమ ఆస్థిపన్ను బకాయిలను తక్షణమే చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. గడువులోగానే పూర్తి లక్ష్యాన్ని – చేరుకుంటాం.
– శంకరయ్య, జడ్సీ శేరిలింగంపల్లి జోన్