బేగంపేట్ (హైదరాబాద్) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ( MLA Talasani Srinivas Yadav) అన్నారు. మారేడ్పల్లిలోని తన నివాసంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ (BRS) పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీ తన హామీలను అమల్లోకి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన యువజన, మహిళా సంఘాలకు, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అండతోనే తన విజయం సాధ్యమైందన్నారు.
ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమవుతాయని, కొత్తగా మంజూరైన పనులు సంక్రాంతి తరువాత ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.