సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ):రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మితమవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 14 స్టేషన్లు ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు. ఔటర్ చుట్టూ జనవావాసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న నేపథ్యంలో 31 కిలోమీటర్ల పొడవునా ప్రతి 2-3 కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్ ఉండే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నగర భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా రూపకల్పన చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 6,250 కోట్ల రూపాయలతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ మేర హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోను నిర్మించేందుకు ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్ గత డిసెంబర్ 9 న మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుంచి నానక్రాంగూడ వరకు అక్కడి నుంచి ఓఆర్ఆర్ వెంట ప్రత్యేక రైల్వే లైన్ కోసం సేకరించిన మార్గం గూండా విమానాశ్రయం లోపలి వరకు వెళ్లేలా ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో 2.5 కి.మీ భూగర్భ మార్గం కూడా ఉంది. 31 కి.మీల దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మెట్రో మార్గం విమాన ప్రయాణికులతో పాటు ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న 31 కి.మీ పరిధిలో ఇరువైపులా ఉన్న ప్రాంతాలకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
మొత్తం ఈ మార్గంలో 14 మెట్రో స్టేషన్లను నిర్మించడం ద్వారా నగరానికి శివారు ప్రాంతాలైన శంషాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల నుంచి కోర్సిటీకి మెట్రో ద్వారా నగరం నలుమూలలా వెళ్లేందుకు అనుసంధానంగా మారుతుందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. కాగా, డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 21 కిలోమీటర్ల మేర క్షేత్ర స్థాయి సర్వే పూర్తయిందని మెట్రో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల రోజులుగా కొనసాగుతున్న క్షేత్ర సమీక్షలో ట్రాఫిక్ పోలీసులతోనూ మెట్రో ప్రాజెక్టు అధికారులు సమావేశమై సర్వే చేపడుతున్నారు. పెరుగుతున్న, రాబోయే కాలంలో పెరగనున్న రద్దీకి అనుగుణంగా ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేస్తే బావుటుందో విశ్లేషిస్తున్నారు. కేవలం 9 నుంచి 10 స్టేషన్లు మాత్రమే ఉంటాయని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ.. సర్వేలో వెల్లడవుతున్న నివేదికలకు అనుగుణంగా మరో 5 స్టేషన్లు పెంచితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరంలో నిర్మించిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ప్రతి ఒకట్రెండు కిలోమీటర్లకో స్టేషన్ ఉన్న విషయం తెలిసిందే.
భారీగా రెసిడెన్షియల్ప్రాజెక్టులు..
మాదాపూర్లోని హైటెక్ సిటీ నుండి మొదలై దాదాపు 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకాపేట, నార్సింగి వరకు ఐటీ కారిడార్ విస్తరించింది. ఈ మార్గంలోని తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు కొన్ని నిర్మాణంలో ఉండగా, మరికొన్ని ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలోని కిస్మత్పూర్లో సుమారు 37 అంతస్థులతో ఒక ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. మరో 10 భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రభుత్వం ఆహ్వానిస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా కమర్షియల్ స్పేస్ ఇక్కడే ఏర్పాటు అవుతుండడంతో భవిష్యత్తులో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఇలా అన్ని కోణాల్లో మెట్రో అధికారులు ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు.
ఇప్పటి వరకు ప్రాథమికంగా నిర్ణయించిన మెట్రో స్టేషన్లు..
1) రాయదుర్గం, 2) బయోడైవర్సిటీ జంక్షన్
3) నానక్రాంగూడ ఓఆర్ఆర్, 4) నార్సింగి
5) తెలంగాణ పోలీస్ అకాడమీ
6) రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్
7) శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్
8) శంషాబాద్ ఎయిర్పోర్టు కార్గో టర్మినల్
9) శంషాబాద్ ఎయిర్పోర్టు ప్యాసింజర్ టర్మినల్
కొత్తగా ప్రతిపాదిస్తున్న స్టేషన్లు…
10) ల్యాంకో హిల్స్-ఖాజాగూడ
11) మై హోం అవతార్ జంక్షన్
12) మంచిరేవుల ఓఆర్ఆర్ అండర్పాస్
13) హిమాయత్సాగర్- దర్గా అండర్పాస్
14) శంషాబాద్ రాళ్లగూడ (షాబాద్ వెళ్లే మార్గం)