సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : సైక్లింగ్ ప్రాధాన్యతను పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆదర్శంగా నిలుస్తున్నది. పెరుగుతున్న వాహనాలతో పర్యావరణ కాలుష్యం ఏర్పడి అనారోగ్యాల బారినపడే పరిస్థితులు వస్తున్నాయి. ఈ క్రమంలో మానసికంగా, శారీరకంగా వంద శాతం ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో సైక్లింగ్ వినియోగం పెంచడానికి సంస్థ కృషి చేస్తున్నది. అందులో భాగంగానే సుచిత్రలోని హెచ్సీజీ కార్యాలయంలో సైకిళ్లు అద్దెకిచ్చే సదుపాయాన్ని కల్పించింది. కాగా, పిల్లలకు ఉచితంగా సైక్లింగ్ నేర్పిస్తారు. ఇందులో సుశిక్షితమైన శిక్షకులు ఉంటారు. అంతేకాదు మొదటి గంట, రెండు గంటలు ఉచితంగా సైకిళ్లు అద్దెకు ఇస్తారు. అనంతరం అతి తక్కువ చార్జి చేస్తారు. సైకిళ్ల మెయింటెనెన్స్ ఉండటంతో ఆ చార్జి చేయాల్సి వస్తుందని హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఫౌండర్ నందనూరి రవీందర్ తెలిపారు. ప్రతీ వీకెండ్లో సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటామని, చాలా మందికి ఈవెంట్లో పాల్గొనాలని ఉంటుంది కానీ సైకిల్స్ లేక రాలేకపోతున్నారని చెప్పారు. ఆ ఇబ్బందిని తొలగించాలనే ఉద్దేశంతో సైకిళ్లను కూడా అందిస్తున్నామని వివరించారు.
సైక్లింగ్పై మక్కువ పెరిగింది..
సుచిత్ర సమీపంలో ఫాక్సాగర్, శామీర్పేట్ లేక్, ఆక్సిజన్ పార్కు తదితర డెస్టినేషన్స్ ఉన్నాయి. బొల్లారం, కండ్లకోయ, అల్వాల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల మీదుగా సైక్లింగ్ చేసే వెసులుబాటు ఉన్నది. ఈ మార్గాల్లో సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. నగరంలో గచ్చిబౌలి, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో నిర్వహించే ఈవెంట్స్లో కూడా హెచ్సీజీ కీలక రోల్ పోషిస్తున్నది. అన్ని సైకిళ్లతోపాటు రోడ్ బైక్ సైకిల్ ఇక్కడ లభిస్తున్నది. సైక్లింగ్పై నగర వాసులకు మక్కువ పెరిగింది. వీకెండ్లో ఐటీ ఉద్యోగులు సైకిళ్లను అద్దెకు తీసుకుని వందల కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేయడం హాబీగా పెట్టుకుంటున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి సైకిళ్లపై సవారీ చేయడం పర్యాటకంగానూ ఆనందమిస్తుందని పలువురు సైక్లిస్టులు చెబుతున్నారు.
కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యం
హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ 2017లో ప్రారంభమైంది. నగరంలో సైక్లింగ్ ప్రాధాన్యత పెరిగింది. ఎటువంటి ఈవెంట్ నిర్వహించినా వందల మంది హాజరవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైక్లింగ్కు అత్యంత ప్రాధాన్యతనివ్వడం అదృష్టంగా భావిస్తున్నాం. సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు గొప్ప విషయం. ప్రతిఒక్కరూ ఒక్కరోజు అయినా సైక్లింగ్ చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు మానసికంగానూ హుషారుగా ఉంటాం. – నందనూరి రవీందర్, ప్రెసిడెంట్, హెచ్సీజీ
సైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది
నగరంలో సైకిల్స్ అద్దెకు ఇచ్చే సదుపాయం చాలా వరకు లేదు. సైక్లింగ్పై ఇష్టముంటే తప్ప ఈ తరహా కార్యక్రమం చేపట్టలేరు. హెచ్సీజీకి థ్యాంక్స్ చెబుతున్నాం. సైక్లింగ్ ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు చాలా మంది సైకిళ్లను సొంతంగా కొనుగోలు చేస్తున్నారు. మొదటి దశలో ఉన్నవారు సైకిల్ను అద్దెకు తీసుకుని వినియోగంపై అవగాహన పెంచుకుంటే మంచిది.
– రాజీకృష్ణ, సైక్లిస్టు