ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 9: దేశాభివృద్ధికి ఆర్థిక సమాఖ్యవాదం అత్యంత కీలకమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. దాంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన సైతం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం, ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఓయూసీఐఎస్) సంయుక్తంగా ‘సమకాలీన భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పునర్నిర్మాణం: నియోజకవర్గాల పునర్విభజన, ఆర్థిక సమాఖ్యవాదం, ఒకే దేశం-ఒకే ఎన్నిక, డిజిటల్ గవర్నెన్స్’అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.
ఓయూసీఐఎస్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బాలకిష్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పరిపాలనలోని సంక్లిష్టతలకు అనుగుణంగా చట్టపరమైన, పరిపాలనాపరమైన విధానాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ, ప్రజాస్వామ్య చర్చలకు వర్సిటీలు మేధోపరమైన కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు. దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఓయూ సాధించిందని, ఆ ప్రాజెక్టుల పరిశోధనలు సాగుతున్నాయని చెప్పారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాష్ర్టాలను తమ ఆధీనంలో పనిచేసే సంస్థలుగా చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రాష్ర్టాలకు సైతం రాజ్యాంగపరమైన స్వయంప్రతిపత్తి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అఫ్రోజ్ ఆలం, సదస్సు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణకుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, బీవోఎస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీలత, డాక్టర్ సబావట్ రవి, రమణ తదితరులు పాల్గొన్నారు.