కాచిగూడ, జూలై 1: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరణ చేయరాదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో కాచిగూడలోని అభినందన్ హోటల్లో సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పిళ్లా శ్రీనివాస్(నివాస్)ను నియామిస్తూ, నియామక పత్రాన్ని ఆర్.కృష్ణయ్య అందజేశారు. ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ, దేశ జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతియేటా 2 కోట్ల ఉద్యోగ నియామకాలను చేపట్టి, నిజాయితిని నిరుపించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న దాదాపు 16 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల హక్కులను సాధించే వరకు దేశ వ్యాప్తంగా బీసీలందరు ఒకే తాటిపై ఉంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లాల్కృష్ణ, నీలా వెంకటేశ్, సి.రాజేందర్, అనంతయ్య, సురేశ్,కిరణ్, సతీశ్ పాల్గొన్నారు.