Bandlaguda Jagir | బండ్లగూడ,మార్చి 27: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో నుంచి అనుమతులు లేని లేఅవుట్కు రోడ్డు వేసేందుకు అనుమతులు ఇచ్చారని మాజీ మేయర్ మహేందర్గౌడ్తో పాటు అధికారులపై డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు నూతన కార్పొరేషన్ భవనాన్ని పరిశీలించారు. కార్పొరేషన్ భవన నిర్మాణానికి రెండెకరాల 7 గుంటలు కేటాయించగా.. అందులో సుమారు ఒక ఎకరా స్థలంలో భవనాన్ని నిర్మించి, వాస్తు కోసం స్థలంను వదిలినట్లు అధికారులు తెలిపారు.
కాగా వాస్తు కోసం ఆ స్థలం వదలాల్సిన అవసరం లేదని, వెనకాల ఉన్న మాజీ మేయర్ బంధువులు వేసిన లేఅవుట్కు రోడ్డు వేసేందుకు అధికారులతో కలిసి వాస్తు పేరుతో ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయం పై కార్పొరేటర్లు నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అస్లాంబిన్ అబ్దుల్లా, చంద్రశేఖర్, భూపాల్గౌడ్, ప్రశాంత్నాయక్, నాయకులు ప్రేమ్గౌడ్, గోపాల్ ముదిరాజ్, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.