సిటీబ్యూరో,జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, ఫుట్పాత్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో అనేక చోట్ల కొత్తగా ఫ్లై ఓవర్లు, ఇతర రోడ్ల నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో వాటికి అనుబంధంగా ప్రస్తుతం ఉన్న రహదారుల పై పుట్పాత్ నిర్మాణాలు అవసరమన్నారు. నగరంలో ఫుట్పాత్ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి నగర పోలీస్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, సంబంధిత ఇతర శాఖల అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సమావేశం నిర్వహించారు. పాదచారుల రక్షణ కోసం పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అందించాల్సిన సహకారంతో పాటు నగరంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్లు, నూతన ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాల పై చర్చించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో పాదచారులకు రక్షణ కల్పించడం, ఫుట్పాత్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ లాంటి సవాళ్లు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయని, నూతన ప్రణాళికలను అమలు చేయడంతోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
నగరంలో వాహనాల సంఖ్య పెరిగిందని ఫలితంగా రోడ్ల పై భారీగా ట్రాఫిక్ ఏర్పడుతున్నదని, ప్రజలకు అనువైన ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ఎదురోవడం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. తకువ దూరాలకు వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నడక లేదా సైకిల్ను కొన్ని నగరాల్లో ఉపయోగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే 60 జంక్షన్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేస్తోందని, పాదచారులే ప్రధాన కేంద్రంగా దాదాపు 12 జంక్షన్లలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్కు జీహెచ్ఎంసీ అధికారులు ఈ సమావేశంలో వివరించారు. కూకట్పల్లి, సోమాజిగూడ, పంజాగుట్ట, కొత్తపేట, హబ్సిగూడ, ఖైరతాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో నూతనంగా జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.