వెంగళరావునగర్, మే 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు చేసిన రూ.5 భోజన కేంద్రాన్ని గురువారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిమ్స్ తరహాలోనే నగరం నలుమూలల టిమ్స్ సూపర్స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణం జరగనుందన్నారు.
నగరంలోని 18 ప్రభుత్వ దవాఖానలకు రోజు వేలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తుంటారని, వారు తమ భోజన అవసరాల కోసం రోజు రూ.150 నుంచి రూ.200ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయం పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రోగుల సహాయకులకు రూ.5 కే నాణ్యమైన భోజనం అందించే ఆలోచన చేశారన్నారు. హరేరామ, రహేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏదైనా రూ.5 కే అందజేసే ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ భోజనం ఇంట్లో మాదిరిగానే రుచికరంగా, నాణ్యతగా ఉంటుందన్నారు. దవాఖానాల ద్వారా అందించే భోజనం కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.3866 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. హరీశ్రావు ఆరోగ్య మంత్రి అయిన తర్వాత వైద్య అవసరాలు తెలుసుకుని అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఐఏఎస్ ఆధికారి డాక్టర్ ప్రీతి మీనా, ఛాతీ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్, కార్పొరేటర్ దేదీప్య, డాక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.