సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): నేడు (ఆదివారం) భారత ప్రధాని నరేం ద్రమోదీ హైదరాబాద్ సందర్శన, పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగసభను పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీల కదలికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
బేగంపేట ఎయిర్పోర్ట్-బేగంపేట-గ్రీన్ల్యాండ్స్-పంజాగుట్ట-నాగార్జున సర్కిల్-ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్-ఎస్ఎన్టీ జంక్షన్-సాగర్ సొసైటీ-ఎన్టీఆర్ భవన్-జూబ్లీహిల్స్ చెక్పోస్ట్-పెద్దమ్మతల్లి కమాన్-రోడ్నెం.36/31- నీరూస్ జంక్షన్-సైబర్ టవర్స్ జంక్షన్-శిల్పారామం-హైటెక్స్ కమాన్ వద్ద కుడిమలుపు-ఎన్ఏసీ మెయిన్ గేట్-బ్లాక్ 22-ఎడమమలుపు-కాసాని గేట్-కుడిమలుపు-హెచ్ఐసీసీ చెక్పోస్ట్-రాక్ సర్కిల్-వీవీఐపీ అలైటింగ్పాయింట్ మరియు అదే మార్గంలో తిరిగి ప్రయాణిస్తారు.
ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రజలు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి పదిగంటల వరకు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని ఆయన కోరారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి నగర ప్రజలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11గంటల మధ్య ఎంజీరోడ్, ఆర్పీరోడ్, ఎస్డీ రోడ్డు మార్గాల్లో ప్రయాణించవద్దని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లాలనుకునేవారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ముందస్తుగా బయలుదేరాలని ఆయన సూచించారు.