మొయినాబాద్, ఎప్రిల్ 1: వేద పండితుల మంత్రోచ్ఛరణలు..భక్తుల గోవింద నామస్మరణలతో చిలుకూరు బాలాజీ దేవాలయం మారుమ్రోగింది. బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గరుత్మంతునికి ,ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.గరుత్మంతుని పటాన్ని పల్లకిలో ప్రతిష్టించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభం మీద గరుడ పతాకాన్ని ఆవిష్కరించారు. తరువాత గరుడ పటానికి నాలుగు దిక్కుల గరుత్మంతుని రూపాలు ప్రతిష్టించి నైవేద్యాన్ని సమర్పించారు.అనంతరం గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన గరుడ ప్రసాదాన్ని సంతానంలేని మహిళలకు పంపిణీ చేశారు. కాగా, ధ్వజారోహణం రోజున గరుడ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉండటంతో సంతానం లేని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శణానికి ఒక్కసారిగా భక్తులు రావడంతో వారిని నియంత్రించే వారు లేకపోయారు. అదే సమయంలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ చిలుకూరు బాలాజీ ఆలయానికి రావడంతో స్వామి వారి దర్శణం కోసం వచ్చిన భక్తులను నిలిపివేయడంతో క్యూలైన్లో ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేనేజింగ్ డైరెక్టర్ సౌందరరాజన్, కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు రంగరాజన్, నర్సింహన్, కన్నయ్య, కిట్టుస్వామి, మురళీ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.