కవాడిగూడ : సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ, ఏపీ సీఎంలు, పార్లమెంట్ సభ్యులు మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాలని సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్ సాధన సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్లో సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్ను ఏర్పాటు చేస్తే దక్షిణాదిన అన్ని రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, బాషా సమస్య తలెత్తకుండా ఉంటుందని సాధన సమితి అధ్యక్షుడు సుధా నాగేందర్, ప్రధాన కార్యదర్శి పి. మోహన్రావు అన్నారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు దేశంలోని పలు ప్రాంతాలలో సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్లను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాయని వారు గుర్తు చేశారు. చెన్నైలో సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బెంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తేనే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. బెంచ్ ఏర్పాటుకై కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి వినతి పత్రాలను అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జ్యోతీరావు, కార్యనిర్వహక కార్యదర్శులు సుధీర్ లింగాల, పి. సతీష్, మోజంబాయి అలీ, చంద్రమౌళి, కార్యదర్శులు ఆర్. వెంకటేశ్వర్లు, లాజరస్ బాబులు పాల్గొన్నారు.