ముషీరాబాద్ : మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తుతున్న ప్రాంతాల్లో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ లీకేజీకి సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం ఆయన జలమండలి జీ.ఎం సుబ్బారాయుడుతో కలిసి అడిక్మెట్ డివిజన్ లక్ష్మమ్మ పార్కు, ముషీరాబాద్ డివిజన్ ఏక్ మినార్ మసీదు వెనుక ప్రాంతాల్లో పర్యటించి డ్రైనేజీ సమస్యల తీరును పరిశీలించారు. డ్రైనేజీ సమస్య తలెత్తడానికిగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్లు శిథిలమైపోవడం, ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడం వల్లన డ్రైనేజీ లీకేజీ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. బస్తీలు, కాలనీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి పైపులైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నిధులు మంజూరు చేయించి దశలవారిగా మురుగు నీటి లీకేజీ సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ క్రిష్ణమోహన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, వి.సుధాకర్గుప్త, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్రెడ్డి, దీన్దయాల్రెడ్డి, శివముదిరాజ్, శ్యామ్ససుందర్, సురేందర్, మల్లిఖార్జున్రెడ్డి, బొట్టు శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, మురళీ, రవియాదవ్, బల్ల ప్రశాంత్, శ్రీకాంత్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.