ఎల్బీనగర్, ఫిబ్రవరి 6 : సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులతో జాబ్మేళా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్మేళాకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని కోరారు. 120 కంపెనీలతో సుమారు 10 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ మెగా జాబ్మేళాలో సుమారు 20 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు.
జాబ్మేళా కోసం మంచినీటి సౌకర్యం, ముత్రశాలలు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. పోలీసులు ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆన్లైన్లో సుమారు 6 వేల మంది దరఖాస్తులు రిజిస్ట్రర్ చేసుకున్నారని, ఈనెల 11వ తేదీ వరకు మరో రెండు రెట్లు అభ్యర్థులు వస్తారని అన్నారు.
జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రధానంగా శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాబ్మేళాలో సాయంత్రం వరకు ఇంటర్వ్యులు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణలో తొలిసారిగా భారీ ఎత్తున మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ఎల్బీనగర్లోని సరూర్నగర్ స్టేడియం మైదానంలో మెగా జాబ్మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.