సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న నిత్యావసర వస్తువులను కృత్రిమంగా తయారు చేసి.. కల్తీని ప్రజలకు విక్రయిస్తున్నారు. మరోపక్క నగరంలోని హోటళ్లలో కూడా కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. కల్తీ ఆహారపదార్థాల బారిన పడి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా.. అధికార యంత్రాంగం నిద్ర మత్తులో ఉన్నదని విమర్శలొస్తున్నాయి. ఇటీవలే సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, ఈస్ట్జోన్ పోలీసులు కలిసి కాటేదాన్, నాగారం కేంద్రంగా తయారు చేస్తున్న నకిలీ కొబ్బరి నూనె, మసాల, కిరాణా సరకులకు సంబంధించిన గుట్టును రట్టు చేశారు.
నగర శివారు ప్రాంతాల్లో రహస్యంగా ఈ నకిలీ వస్తువులను తయారు చేస్తూ.. బేగంబజార్ అడ్డాగా హైదరాబాద్తో పాటు రా్రష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. సబ్బులు, నూనెలు, జండూబామ్ తయారు చేస్తూ.. పేరున్న కంపెనీల స్టిక్కర్లను అతికించి విక్రయిస్తున్నారు. అలాగే, ఆహారపదార్థాల్లో ఉపయోగించే మాసాల దినుసుల్లోని గసగసాలు, మిర్యాలు, లవంగాలు, డ్రైఫ్రూట్స్, పిండి, బియ్యం.. అన్ని రకాల వస్తువులు నకిలీవి చేస్తున్నారు.
వీటితో పాటు వేసవి కాలం వస్తుండటంతో మంచినీటిని కూడా కలుషితం చేసి విక్రయిస్తుంటారు. నకిలీ ఐస్క్రీమ్లు, నకిలీ కూల్ డ్రింక్లను కూడా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ఈ నకిలీ వస్తువుల విక్రయాలపై నిఘా పెట్టి, అరికట్టాల్సిన పుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులు, జీహెచ్ఎంసీలోని పుడ్సేఫ్టీ అధికారులకు ఎక్కడెక్కడ నకిలీ విక్రయాలు జరుగుతున్న వివరాలు తెలిసినా వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నకిలీలతో కొంతమంది టాస్క్ఫోర్స్ సిబ్బంది కూడా చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కృత్రిమంగా తయారీ..!
సహజ సిద్ధంగా పొలాల్లో పండిన పంటల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తినడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే, ఈ సహజ సిద్ధంగా పండే పంటల నుంచి వచ్చే ఆహారపదార్థాలు కాకుండా.. కొందరు కృత్రిమంగానే తయారు చేస్తున్నారు. ఇందుకు కొన్ని కెమికల్స్ను ఉపయోగిస్తున్నారు, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి కెమికల్స్ను కలిపి.. ఈ నకిలీ వస్తువులు తయారు చేస్తున్నారు. జిలకర్ర, సాజిర, బాదం, లవంగాలు, ఇలాచీలు, గసగసాలు, మిర్యాలు, కర్రం పొడి, పసుపు, గోదుమ పిండి, నూడిల్స్.. ఇలా ఒకటేమిటి ఇంటిలోని వంట గదిలో ఉండే ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువులన్నీ నకిలీవి తయారు చేస్తున్నారు. మేమున్నామంటూ.. అప్పడప్పుడు పోలీసులు దాడులు చేస్తుంటారు. ఏడాదికోసారి పుడ్సేఫ్టీ అధికారులు కూడా.. మేం సైతం.. అంటూ దాడులు చేస్తుంటారు. పూర్తిస్థాయిలో మాత్రం అటు పోలీసులు, ఇటు ఫుడ్సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి. రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లే కృత్రిమంగా నకిలీ పదార్థాలు తయారు చేస్తూ.. విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి
బేగంబజార్ అంటేనే..!
బేగంబజార్లో తినే వస్తువులతోపాటు ఇతర సామగ్రిని కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నిజాయితీగా వ్యాపారం చేసే వారికి.. ఈ నకిలీ వ్యాపారులు భారీ నష్టం కలిగిస్తున్నారు. అసలు వస్తువుల మాదిరిగానే నకిలీ వస్తువులు కూడా ఉండటంతో నినియోగదారులు గుర్తించలేక మోసపోతున్నారు. ఎవరైనా గుర్తించి ప్రశ్నిస్తే.. నకిలీవి కాదు.. అసలివేనని చెబుతున్నారు. అసలు వస్తువులను చూపించి దబాయిస్తున్నారు. నకిలీలకు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ వస్తువులు విక్రయించి.. వ్యాపారులు కోట్లకు పడగెత్తుతున్నారు. ఆ పదార్థాలు తిన్న సామాన్య ప్రజలు దవాఖానల పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.