హైదరాబాద్ : సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. వయసుతో సంబంధం లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. ఈ పండుగ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పండగను ఆనందంగా జరుపుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఛైర్మన్, ఎండీ జీ రఘుమారెడ్డి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.
-విద్యుత్ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని చోట పతంగులు ఎగురవేయడం మంచింది. బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో పతంగులు ఎగురవేయాలి.
-విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గాలి పటాలు ఎగురవేయవద్దు.
-పిల్లలు, యువకులు విద్యుత్ వైర్ల మీద పడిన గాలి పటాలను తీసేందుకు ప్రయత్నించరాదు. కరెంట్ షాకు తగిలే అవకాశం ఉన్నది.
-కాటన్, నైలాన్, లినెన్తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలి. మెటాలిక్ మాంజాలు వాడొద్దు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పుడు విద్యుత్ షాక్ కలిగే అవకాశం ఉంది.
-భవనాల మీద నుంచి గానీ, సగం నిర్మించిన గోడల మీద నుండి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదు. దీని వలన విద్యుత్ తీగలు శరీరాన్ని తాకి షాక్ కలిగే ప్రమాదం ఉన్నది.
-ఈ సూచనలను దృష్టిలో ఉంచుకుని పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే 1912కు గానీ లేదా సమీపంలోనున్న విద్యుత్ సిబ్బందికి గానీ సమాచారం అందించాలని రఘుమారెడ్డి సూచించారు.