మియాపూర్, ఫిబ్రవరి 27 : దక్కన్ మాల్లో అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో.. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శేరిలింగంపల్లి జోన్లో ముందస్తు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అగ్ని ప్రమాద నివారణ పరికాలు, తగు జాగ్రత్తలు తీసుకోవటంలో వాణిజ్య భవనాల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గుర్తించిన అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వాణిజ్య భవనంలో పూర్తిస్థాయి అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకునేలా చర్యలకు దిగుతున్నారు.
ఇందుకు గాను శేరిలిగంపల్లి జోన్లో ఫిబ్రవరి మొదటివారంలో కొన్ని వాణిజ్య దుకాణాలను ఎంపిక చేసుకుని వాటిల్లో ఏ మేరకు పరికరాలు, నీటి వసతి, ఇతర ఏర్పాట్లున్నాయో తనిఖీలు నిర్వహించారు. వాటి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వాటి ఆధారంగా తాజాగా సదరు భవన యజమానులకు నోటీసులను జారీ చేస్తున్నారు. నిర్ధారిత గడువులోగా ఏర్పాట్లు చేయని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులలో స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా భవన యజమానులకు అగ్ని ప్రమాద నివారణ చర్యలపై జోన్ స్థాయిలో అవగాహన సమావేశాన్ని సైతం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 150 వాణిజ్య భవనాలలో నాలుగు బృందాలు అగ్ని ప్రమాద నివారణా ఏర్పాట్లపై ఫిబ్రవరి మొదటి వారంలో శాంపిల్ సర్వే చేపట్టారు. వాటిలో సింహభాగం ఏర్పాట్లను నిర్లక్ష్యం చేసినట్లు ఉన్నతాధికారులకు ఆ బృందాలు నివేదించాయి. అగ్ని ప్రమాద నివారణకు అవాక్యూమ్స్, నీటి వసతి, అన్ని అంతస్తులకు పైప్లైన్లు, ఫైర్ అలారమ్స్, అత్యవసర ద్వారాలు, ఫైర్ ఇంజిన్ తిరిగేలా వసతి సహా 15 అంశాలను 150 భవనాల వద్ద అధికారులు పరిశీలించారు. అత్తేసరు ఏర్పాట్లతో వాణిజ్య దుకాణ నిర్వాహకులు నిర్లక్ష్యం వ్వవహరిస్తున్నారని గుర్తించి నివేదికలను సైతం సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.
వాటి ఆధారంగా శాంపిల్ భవనాలకు తాజాగా జోనల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసు అందుకున్న 15 రోజులలో అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో భవనంపై కఠిన చర్యలు తప్పవని ఆ నోటీసులో హెచ్చరిస్తున్నారు. నిర్ధారిత గడువు అనంతరం శాంపిల్ సర్వే భవనాలను అధికారుల బృందం మరోసారి తనిఖీలు చేపడుతుంది. పూర్తి చేయని భవనాలపై కఠిన చర్యలకు ఉపక్రమించనున్నది. అయితే శాంపిల్గా 150 భవనాలలో తొలి దశ సర్వే చేపట్టిన అధికారులు ఇక అన్ని వాణిజ్య భవనాలలోనూ తనిఖీలను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ప్రమాదానికి ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు తప్పని సరిగా పేర్కొంటున్నారు.
వాణిజ్య భవనాలలో అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన చేసుకోవాల్సిన పూర్తి స్థాయి ఏర్పాట్లపై జోనల్ స్థాయిలో దుకాణ నిర్వహకులకు అవగాహన సమావేశాలను తాజాగా సోమవారం నిర్వహించారు. ప్రమాద నివారణకు ఏ రకమైన ఏర్పాట్లు చేసుకోవాలనే దానిపై స్పష్టం చేస్తున్నారు. సాంపిల్ సర్వేలో గుర్తించిన 150 మంది వాణిజ్య నిర్వాహకులు ఈ అవగాహన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమకున్న అనుమానాలను అధికారుల ద్వారా నివృత్తి చేసుకున్నారు. అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జోనల్ కమిషనర్ శంకరయ్య హెచ్చరించారు.