సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ ) : కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. బీఆర్ఎస్ హయాంలో అందుబాటులోకి రాగా…రోడ్ల నిర్వహణలో ఢిల్లీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం దిశగా మార్చేసింది. ఈ క్రమంలోనే సీఆర్ఎంపీ రోడ్లపై సాఫీ ప్రయాణం ఒకప్పటి మాట.. కానీ ప్రస్తుతం అడుగడుగునా నిర్వహణ లోపం…గుంతలమయం, ఎగుడు దిగుళ్ల నడుమ ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.
అంతేకాదు రోడ్ల మధ్య డివైడర్లు, రోడ్ల పక్క ఫుట్పాత్లు, రోడ్డుకిరువైపులా పచ్చదనం పెంపు తదితర పనుతో పాటు పారిశుధ్య నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మొదటి దశ సీఆర్ఎంపీ నిర్వహణలో భాగంగా ఏజెన్సీల గడువు గత జనవరి నెలలో ముగిసింది. కొత్తగా టెండర్లు పిలిచి ఏజెన్సీలకు అప్పగించాల్సిన జీహెచ్ఎంసీ గడిచిన ఆరు నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నది.
నిర్వహణ బాధ్యతలను స్వతహాగా భుజాన వేసుకున్న అధికారులు.. నిర్వహణను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్న ఫలితంగా వాహనదారులకు సమస్యలు తప్పడం లేదు. స్వీపింగ్ మిషిన్లను రద్దు చేసి కార్మికులతో పనిచేయిస్తుండగా, చాలా ప్రాంతాల్లో రహదారులపై చెత్తా చెదారం దర్శనమిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కురిసిన వర్షాలకు ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లోని పలు ప్రాంతాల్లో సీఆర్ఎంపీ రోడ్లు గుంతలు ఏర్పడ్డాయి. పంజాగుట్ట, యూసుఫ్గూడ, మాదాపూర్ వంటి ఏరియాల్లో గుంతలు ఎక్కువగా ఉండడంతో వాహనదారులకు ప్రయాణంలో ఇబ్బందులు తప్పడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వ హయంలో..
కేసీఆర్ ప్రభుత్వ హయంలో గుంతలు లేని రహదారుల లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 510 విభాగాలుగా విభజించి తొలి విడతగా 744 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020లో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు రూ.1050 కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని గతేడాది అక్టోబరులోనే చేరుకున్నారు. ఈ సీఅర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా.. ఛత్తీస్గఢ్ , రాజస్థాన్కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు. ఇటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ రూ. రూ.1334 కోట్ల ప్రతిపాదనలను పక్కన పెట్టడం, కనీసం మొదటి దశ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహణ చేపట్టకపోవడం గమనార్హం. కాగా, సీఆర్ఎంపీ మొదటి దశలో భాగంగా రోడ్ల నిర్వహణ బాధ్యతలు గత జనవరి నెలలో ఏజెన్సీల నిర్ణీత గడువు ముగిసింది.
దీంతో ఫుట్పాత్ల నిర్వహణ, సెంట్రల్ మీడియన్, కెర్భ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ జీహెచ్ఎంసీ చేపడుతూ వస్తున్నది. మొదటి దశతో పాటు రెండో దశ కలిపి రూ. 3825 కోట్ల రోడ్ల నిర్వహణ పనులకు పరిపాలన అనుమతి ఇవ్వాలని ఈ నెల 6న జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. అయితే సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణకు అసలు నిధుల సమస్యలే కారణమని, అందుకే ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదని అధికారులు చెబుతున్నారు.