అమీర్పేట్, అక్టోబర్ 17: కొవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పోస్టల్ సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం పోస్టల్ శాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలో ‘డాక్-సేవా అవార్డులు 2021’ కార్యక్రమాన్ని బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సాంకేతిక సహకారంతో పోస్టల్ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం ఎనిమిది వేర్వేరు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు డాక్ సేవా అవార్డులు ప్రదానం చేశారు.
గ్రామీణ్ డాక్ సేవక్గా ఎంపికైన పెద్దపల్లి డివిజన్కు చెందిన ఎన్.సునీత, కరీంనగర్ డివిజన్కు చెందిన పోస్ట్మెన్ ఎ.శివకుమార్, హైదరాబద్ సౌత్ ఈస్ట్ డివిజన్కు చెందిన ఎస్పీఎం ఎస్.విశ్వనాథ్, కరీంనగర్ డివిజన్కు చెందిన ఎల్ఎస్జీ ఎస్పీఎం కె.రాజ్కుమార్, తెలంగాణ సర్కిల్ హైదరాబాద్ పరిధిలోని సీపీఎంజీ కార్యాలయంలో ఏఎస్పీ బి.శ్రీనివాస్, ఆదిలాబాద్ డివిజన్కు చెందిన ఎస్పీవో కేబీఆర్ ప్రసాద్, హైదరాబాద్ రీజియన్ పరిధిలోని పీఎంజీ కార్యాలయంలో ఐపీ (టెక్నికల్) మహ్మద్ గౌస్ పాష, వనపర్తి డివిజన్కు చెందిన కె.శృతి బెస్ట్ వుమెన్ ఎంప్లాయ్గా అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ పీఎంజీ ఎస్.రాజేందర్కుమార్, హెడ్ క్వార్టర్స్ రీజియన్ పీఎంజీ టి.ఎం.శ్రీలత, హెడ్క్వార్టర్స్ డీపీఎస్ కె.ఎ.దేవరాజ్, హైదరాబాద్ రీజియన్ పీఎంజీ డాక్టర్ పీవీఎస్ రెడ్డి పాల్గొన్నారు.