గోల్నాక, ఏప్రిల్ 7: మ్యాన్హోల్ ఏర్పాటు చేస్తే ఇంజినీరింగ్ ప్రమాణాల ప్రకారం కనీసం ఐదేండ్లయినా మన్నికగా ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి వేసిన కొన్ని రోజులకే మూ తలు విరిగి పోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎన్ని నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. బాగ్అంబర్పేట డివిజన్ మల్లికార్జుననగర్, తురాబ్నగర్, రెడ్ బిల్డింగ్, సీఈ కాలనీ, కుమ్మరిబస్తీ, వడ్డెరబస్తీ తదితర ప్రాంతాల్లో రహదారులకు ఎత్తుగా ఉన్నాయని వాటి స్థానంలో ఇటీవల కొత్త మ్యాన్హోళ్లు ఏర్పా టు చేశారు.
వాటి నిర్మాణం సమయంలో వాటి నాణ్యతా ప్రమాణాలను సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో గుత్తేదారు నాసిరకంగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలు వస్తే మ్యాన్ హోళ్ల మూతలు పగిలిపోతున్నాయి. దీంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పాడైన మ్యాన్హోళ్లకు మరమ్మతులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
మ్యాన్హోళ్లకు మరమ్మతులు చేస్తాం
అక్కడక్కడ మ్యాన్హోళ్ల మూతలు విరిగినట్లు మా దృష్టిలో ఉంది. వెంటనే పాడైన మ్యాన్ హోళ్లకు మరమ్మతులు నిర్వహించి సమస్యను పరిష్కరిస్తాం. – మాజిద్, సెక్షన్మేనేజర్, జలమండలి