జూన్ 4 రాజకీయ పార్టీల నేతల్లోనే కాదు.. అధికారుల్లోనూ టెన్షన్ నెలకొన్నది. మరో 15 రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొనగా.. ఫలితాలు ముగిసిన తర్వాత ఉంటామా.? ఊడుతామా.? అనే టెన్షన్ అధికారుల్లో నెలకొన్నది. ఎన్నికల కోడ్ ముగిస్తే రాజకీయ జోక్యం పెరిగే అవకాశాలు ఉంటాయని, ఆలోపే అన్ని చక్కబెట్టుకోవాలనే ధోరణిలో అధికారులు దూకుడు పెంచారు.
Transfers | సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : ఇంకో పదిహేను రోజుల్లో ఇక్కడ ఉంటామా? మారిపోతామా? ఉన్పప్పుడే అన్ని పనులు చక్కబెట్టుకోవాలనే ధోరణితో కొందరు పోలీసులు జూన్ 4వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొంత మంది ఐపీఎస్, డీఎస్పీలతో పాటు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుల్స్ను బదిలీ చేశారు. ఇందులో భాగంగానే ట్రై పోలీస్ కమిషనరేట్లకు కొత్త బాస్లు వచ్చారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాచకొండ కమిషనర్తో పాటు హైదరాబాద్లో కొందరు అదనపు పోలీస్ కమిషనర్లు ఎన్నికల నియమావళిలో భాగంగా బదిలీ చేశారు.
రాచకొండ కమిషనర్ మినహా హైదరాబాద్లో ఖాళీ అయిన పోస్టులలో కొత్తవారిని నియమించలేదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడిన మరుసటి రోజు ఎన్నికల కోడ్ ముగుస్తుంది. అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుల సూచనలు, ఎమ్మెల్యేల సూచనలతో కొత్త అధికారులు చాలా చోట్ల బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరు ఎక్కడ ఎన్నిరోజులు ఉంటారనే విషయంలో ఇప్పుడు అధికారులకు స్పష్టత లేదు. దీంతో కొందరు అధికారులు తమ దృష్టికి వచ్చిన కేసులు, ఇప్పటికే ఒప్పందాలు చేసకున్న కేసులను త్వరగా ముగించుకొని అందులో ఏమైనా ఆర్థిక వ్యవహారాలు ఉంటే సర్దుబాటు చేసుకొని బదిలీలకు సిద్ధంగా ఉండాలని చూస్తున్నారు.
ఈ ఆరు నెలల సమయంలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో పనిచేసే సీఐలు, ఎస్సైలపై వివిధ ఆరోపణలు రావడంతో బదిలీ, సస్పెన్షన్ వేటు పడ్డాయి. మరికొందరు ఏసీబీకి కూడా పట్టుబడ్డారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చాలా మందికి ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టింగ్లు ఇచ్చారు. అయితే జూన్ 4వ తేదీ తరువాత స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తమకు కావాల్సిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని కమిషనర్లపై ఒత్తిళ్లు తెచ్చేందుకు అవకాశం ఉందనే టాక్ పోలీస్ వర్గాలలో నడుస్తున్నది.
ఈ క్రమంలోనే పోస్టింగ్ ఉంటుందా? లేదా? అని కొందరు అధికారులలో సందిగ్ధత నెలకొన్నది. నిజాయితీ, ప్రతిభ ఆధారంగా పోలీస్ కమిషనర్లు కొంత మంది అధికారులను బదిలీ చేసేందుకు ససేమెరా అనే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అధికారులు పూర్తి ధీమాతో ఉన్నారు. ఉహించని విధంగా మంచి ఠాణాలకు ఎస్హెచ్ఓలుగా పోస్టింగ్లు రావడం, దీపం ఉన్నప్పుడు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉండే వారు కొందరుంటారు. అలాంటి వారు మాత్రం జూన్ 4వ తేదీ లోపు ఏమైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలుంటే త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలాఉండగా ఉన్నతాధికారుల్లోనూ కొందరు మారే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. జూన్ 4వ తేదీ తరువాత ఎంత మంది అధికారులు బదిలీ అవుతారు, ఎంత మంది అదే పోస్టులలో ఉంటారనే విషయంపై స్పష్టత వస్తుంది.