సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 13లక్షల మంది పిల్లలను గుర్తించగా, అందులో 5,09,461 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్నారు. వీరికోసం నగర పరిధిలో 2800 పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
ఈనెల 27 నుంచి మార్చి 2వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు గ్రేటర్ వ్యాప్తంగా పోలియో చుక్కలు వేయనున్నారు. ఉదయం 7 నుంచి సాయ ంత్రం 6గంటల వరకు పంపిణీ జరుగనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. తొలిరోజు కేవలం పోలింగ్బూత్లలో చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేస్తామని, 28, మార్చి 1,2వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు తదితర పబ్లిక్ ప్రాంతాల్లో చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా ట్రాన్సిట్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే చిన్నారులకు లేదా వారి ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే వారికి ఈ షెడ్యూల్లో పోలియో చుక్కలు వేయరు. పాజిటివ్ ఉన్న ఇంటిని గుర్తించి.. రెడ్మార్క్ చేసి వారి వివరాలను రికార్డు చేసుకుంటారు. క్వారంటైన్ సమయం పూర్తయిన తరువాత ఆరోగ్య కార్యకర్తలు రెడ్మార్క్ చేసిన ఇంటిలో ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేస్తారని వైద్యాధికారులు వెల్లడించారు.