సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగం నుంచి రెండు పోలీస్ జాగిలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు రిపోర్ట్ చేసినట్లు సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ హనుమంతరావు తెలిపారు. కొత్తగా చేరిన ఈ రెండు కేనైన్(జాగిలాలు)లతో కలిపి ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ జాగిలాల సంఖ్య 18కి చేరింది. ఈ జాగిలాలలో 12 కేనైన్లు పేలుడు పదార్థాల గుర్తింపు కోసం, రెండు కేనైన్లను మాదకద్రవ్యాల గుర్తింపునకు, మరో నాలుగు కేనైన్లను ట్రాకర్ జాగిలాలుగా సేవలు అందిస్తున్నట్లు అదనపు డీసీపీ వివరించారు.
సీఐడీ నుంచి కొత్తగా రిపోర్ట్ చేసిన కేనైన్లలో 4ఏండ్ల వయస్సు గల ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), 10ఏండ్ల వయస్సుగల ‘రాడో’ (లాబ్రడార్) ఉన్నట్లు తెలిపారు. నేరాల ఛేదన, పేలుడు పదార్థాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఈ కేనైన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఏడీసీపీ చెప్పారు. బీడీ టీమ్ ఆర్ఐ నాగరాజు సారథ్యంలో, ఆర్ఎస్ఐ వెంకటేష్ సహకారంతో ఈ కేనైన్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకొస్తామని ఏడీసీపీ తెలిపారు.