హైదరాబాద్ : బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పోలీసులు హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది నెలల క్రితం కొంతమంది హవాలా డబ్బులు సరఫరా చేసే ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారిపై నిఘా పెట్టారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ముంబై, గుజరాత్ల నుండి హవాలా డబ్బు సుమారు నాలుగు కోట్ల రూపాయలు వస్తున్నాయనే సమాచారం మేరకు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాపు కాశారు.
కాగా, హవాలా డబ్బు తరలిస్తున్న నిందితుల కోసం ఎదురు చూస్తున్న పోలీసులను చూసి పారిపోతుండగా వారి వాహనాలను పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం వారి వాహనాలను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ హవాలా నగదును పాత పది రూపాయల నోటు కోడ్ ఆధారంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ తనిఖీలలో సుమారు 4కోట్ల5లక్షల హవాలా డబ్బుల సంచులు లభించగా, ఇద్దరు నిందితులు, కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.