Hyderabad | వెంగళరావునగర్, జూన్ 8 : బ్యాంక్ నుంచి రుణాన్ని తీసుకుని.. వాయిదాలు చెల్లించకుండా ఫేక్ నంబర్ ప్లేట్తో తిరుగుతున్న కారుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రోజుల తరబడి పోలీసు స్టేషన్ ఎదుటే కారు పార్కింగ్ చేసిన ఆ మోసగాడిపై బ్యాంకు అధికారులు గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడకు చెందిన బాడెటి మధుసూదన్ రావు వ్యాపారి. 2018, మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియలో రూ.6 లక్షల కారు రుణాన్ని తీసుకున్నాడు. సకాలంలో కారు ఈఎంఐలు చెల్లించకుండా.. కారు నంబర్ ప్లేట్ను ఏపీ నుంచి టీఎస్కు మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎక్కడ పార్కింగ్ చేసినా దొరికిపోతానని భావించి ఏకంగా ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుటే తన కారును రోజులు తరబడి పార్కింగ్ చేశాడు.
ఓ పని మీద ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్కు వచ్చిన సదరు బ్యాంకు అధికారి కంట ఆ కారు పడింది. అనుమానం వచ్చి పరిశీలించగా.. ఆ నంబర్తో ఓ ఆటో రిజిస్టర్ అయినట్లు తెలిసింది. ఫేక్ నంబర్ అని తేలడంతో ఇది బ్యాంకు నుంచి రుణం పొందిన కారు అని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారి జగదీశ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బ్యాంక్ అధికారులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కారును అక్కడ పార్కింగ్ చేసిన నిందితుడు.. మరో కారులో వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.