సిటీబ్యూరో: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ.. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ.. పంజాగుట్ట ఠాణాలో ఇన్నాళ్లు విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిలో 85 మందిని బదిలీ చేసిన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి.. ఆ స్టేషన్లో మిగిలి ఉన్న మిగతా వారిని కూడా దఫ దఫాలుగా బదిలీ చేస్తారని తెలిసింది.
మొదటి సారిగా ఒకే ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై నుంచి హోంగార్డు వరకు 130 మంది సిబ్బందిలో 85 మందిని కార్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంకా 45 మంది వరకు సిబ్బంది పాత వాళ్లు ఉన్నారు. వీళ్లను కూడా దశల వారీగా బదిలీ చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, పంజాగుట్ట ఠాణాలోని సిబ్బందిని బదిలీ చేసి అవినీతి, అక్రమార్కులు, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ప్రక్షాళన చేయడం మొదలు పెట్టిన సీపీ ఇదే తరహాలో మరికొన్ని పీఎస్లపై నిఘా పెట్టారని సమాచారం.