సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది. వీరిలో అత్యధిక శాతం గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో ప్రస్తుతం 1300కు పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో తొలివిడతగా డ్రగ్ టెస్టులు చేయించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్పోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ), టాస్క్ఫోర్స్ విభాగాలు స్థానిక పోలీసుల సహకారంతో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి.
మొదటివిడతలో భాగంగా వారిలో 239 మందికి పలుచోట్ల డ్రగ్ పరీక్షలు చేశారు. ఇందులో 189 మంది మాదకద్రవ్యాలు సేవించినట్లుగా వచ్చిందని హెచ్న్యూ పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారంతా గంజాయికి అలవాటుపడినట్లు పోలీసులు గుర్తించారు. గాంధీ ఆసుపత్రిలో 70 మందికి పరీక్షలు నిర్వహించగా 44 మందికి పాజిటివ్, 76మందికి నెగెటివ్ వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రిలో 80 మందికి పరీక్షలు చేయగా, 59 మందికి పాజిటివ్, 21 మందికి నెగెటివ్ , ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 89మందికి పరీక్షలు చేయగా, 86 మందికి పాజిటివ్, ముగ్గురికి నెగెటివ్ వచ్చిందని హెచ్న్యూ పోలీసులు పేర్కొన్నారు.
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో పరీక్షించినవారిలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈ మూడుచోట్ల డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. పరీక్షల అనంతరం వారికి వైద్యులు, మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా, రాజేంద్రనగర్ జోన్ చాంద్రాయణగుట్టలో పలువురు రౌడీషీటర్లకు డ్రగ్స్ రాపిడ్ టెస్టును నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది.
గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్ జోన్లకు సంబంధించిన వారిలో చాలామంది ఇటీవల వరుసగా దారుణ నేరాలకు పాల్పడడం, పోలీసులకు సైతం వినకుండా అరాచకాలు చేస్తుండడంతో అసలు వారి వ్యవహారశైలికి కారణమేంటనే కోణంలో పోలీసులు ఆరా తీయగా వారంతా మత్తులో ఈ పనులు చేస్తున్నట్లు గుర్తించారు. అసలు వీరికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నది.. దీని వెనక ఉన్న ప్రధాన నెట్వర్క్ ఏమిటి.. వీరు డ్రగ్స్, గంజాయి ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. చాలామంది రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ జోన్ల పరిధిలో ఉన్న ఎక్కువ మంది రౌడీషీటర్లు ఒకవైపు తమ ఆగడాలు కొనసాగిస్తూనే మత్తు పదార్థాల విక్రయంతో పాటు వాటిని వినియోగిస్తున్నట్లు పోలీసుల నిఘాలో తేలింది. ప్రస్తుతం నగరంలో మొదటివిడతలో కొందరికి టెస్టులు చేయగా, త్వరలోనే మరికొందరికి కూడా నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.