బంజారాహిల్స్, మే 14 : జూబ్లీహిల్స్లోని ప్రశాసనగర్లో నివాసముంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో చోరీ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. సొత్తును రికవరీ చేశారు. జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం 72లోని ప్రశాసన్నగర్లో నివాసముంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి కొమ్మి ఆనందయ్య మార్చి 16న తన భార్యతో కలిసి కాకినాడలో నివాసముండే తన కొడుకు రమేశ్ వద్దకు వెళ్లి పదిరోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అల్మారాలో ఉండాల్సిన రెండు బంగారం బిస్కట్లతో సహా 30తులాల బంగారం, పూజగదిలో ఉండే వెండి వస్తువులు, రూ.40వేల నగదుతోపాటు ఖరీదైన వాచీలు. 500 అమెరికన్ డాలర్లు చోరీ అయినట్లు గుర్తించారు.
ఈ మేరకు ఆనందయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.సీసీ ఫుటేజీల సాయంతో చోరీకి పాల్పడిన వ్యక్తి గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిన్నపుర్ల గ్రామానికి చెందిన చేపల అంజప్ప అలియాస్ అంజి అలియాజ్ మచ్చా అని గుర్తించారు. ఇటీవల నార్సింగి పీఎస్ పరిధిలో మరో చోరీ చేసిన అంజప్ప అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. నార్సింగిలో పట్టుబడిన అంజప్పను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు తాము వెతుకుతున్న పాత నేరస్తుడు అంజప్పను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు అనుమతితో శనివారం నుంచి రెండురోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చారు. పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
రైల్వే ట్రాక్పక్కన నగలను పాతిపెట్టి..
ప్రశాసన్నగర్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆనందయ్య ఇంట్లో చోరీ చేసిన అంజప్పను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆనందయ్య ఇంటికి తాళం వేసిన విషయాన్ని గుర్తించిన అంజప్ప వెనకనుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు తేలింది. బెడ్రూమ్లో బంగారు ఆభరణాలు, రెండు బంగారు బిస్కెట్లతో పాటు రూ.40వేల నగదును ఇతర వస్తువులను చోరీ చేసిన అంజప్ప నేరుగా ఖైరతాబాద్ సమీపంలోని రాజ్నగర్ మక్తావద్ద రైల్వే ట్రాక్ పక్కన గొయ్యి తీసి ఆభరణాలను పాతిపెట్టాడు. మరికొన్ని వెండి వస్తువులను తాజ్ బంజారా హోటల్ ఎదురుగా ఉన్న చెరువులోని ఖాళీ స్థలంలో దాచేశాడు. చోరీ చేసిన డాలర్లను నాంపల్లిలోని మనీ ఎక్సేంజ్ వ్యాపారివద్ద మార్చుకుని నగదు తీసుకున్న అంజప్ప చోరీ చేసిన నగదుతో స్నేహితులకు పార్టీ ఇచ్చిన అనంతరం వారితో ఆటోలో కలిసి యాదాద్రి వెళ్లాడు. స్నేహితులకు చోరీ విషయం చెప్పకపోవడంతో వారికి ఎలాంటి అనుమానం రాలేదు. కాగా స్నేహితులంతా సెల్ఫీలు తీసుకుంటున్నా తాను మాత్రం పోలీసులకు పట్టుబడుతాననే అనుమానంతో ఫోటోలు దిగలేదు.
గోల్డ్ బిస్కెట్లను అమ్మేసి ముంబైకి..
రెండ్రోజుల తర్వాత యాదాద్రి నుంచి తిరిగి వచ్చిన అంజప్ప తనకు జైలులో పరిచయమై బెయిల్పై బయటకు వచ్చిన బార్కాస్కు చెందిన మహ్మద్ అబ్దుల్లాను కలిశాడు. గతంలో తాను చోరీ చేసిన సమయంలో రెండు బంగారం బిస్కెట్లు దాచేసానని, వాటిని అమ్మిపెట్టాలని కోరాడు. వారిద్దరూ కలిసి రాజ్నగర్ మక్తా సమీపంలో రైల్వే ట్రాక్వద్ద పాతిపెట్టిన బంగారాన్ని వెలికి తీశారు. రెండు బిస్కెట్లను అమ్మడంతో పాటు మిగిలిన ఆభరణాలను బార్కాస్లోని అబ్దుల్లా తన ఇంట్లో దాచిపెట్టాడు. వచ్చిన డబ్బుతో ముంబైకి వెళ్లిన అంజప్ప జల్సాలు చేయడంతో పాటు తిరిగి వచ్చి బైక్ను కొనుగోలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత మరో స్నేహితుడితో కలిసి నార్సింగిలో చోరీకి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. కస్టడీలో భాగంగా నిందితులు అంజప్పతో పాటు అతడి స్నేహితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నార్సింగి పోలీసులు 13తులాల బంగారం స్వాధీనం చేసుకోగా జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు 15 తులాల బంగారంతో పాటు వెండివస్తువులను స్వాధీనం చేసుకున్నారు.