సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్: సికింద్రాబాద్లో జరిగిన రూ.5 కోట్ల భారీ చోరీ కేసులోని నిందితులను నగర పోలీసులు గుర్తించారు. బాధితుడు, పోలీసులు అనుమానించినట్టే వాచ్మన్ ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. పథకం ప్రకారం నేరం చేసిన వాచ్మన్ కుటుంబ సభ్యులు, నగరంలో ఉన్న అతడి బంధువులతో కలిసి నేపాల్కు ప్రయాణమయ్యాడు. వాచ్మన్ పాత్ర బయటపడటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాచ్మన్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతడి బంధువులు మాత్రం ముంబై రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ నివాసి రాహుల్ గోయెల్ వ్యాపారి. ఈనెల 9వ తేదీన అతడు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో నుంచి దాదాపు రూ. ఐదు కోట్ల విలువజేసే బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలతోపాటు నగదు పోయింది.
ఈ ఇంటికి వాచ్మన్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన కమల్, అతడి కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు. దీంతో పక్క ప్లాన్తో అతడే చోరీ చేశాడని ఇంటి యజమాని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రాంగోపాల్పేట్, టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో వాచ్మన్, అతడి కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో నగరంలో ఉన్న వాచ్మన్ బంధువుల కోసం కూడా గాలించారు. ప్రాథమిక దర్యాప్తులో వీరంతా నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గోయెల్ ఇంట్లో భారీ చోరీ జరగడం, వాచ్మన్ కుటుంబంతోపాటు నగరంలో ఉంటున్న అతడి బంధువులు కూడా నేపాల్ ప్రయాణమైనట్లు గుర్తించిన పోలీసులు.. రైలు మార్గాలపై నిఘా పెట్టారు. నిందితులను పట్టుకునేందుకు రైల్వే అధికారులు, పోలీసుల సహాయం కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో వాచ్మన్ కమల్ బంధువులు ముంబై రైల్వే స్టేషన్లో చిక్కారు. ప్రధాన నిందితుడైన కమల్ మరో మార్గంలో నేపాల్ వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కమల్ నెట్వర్క్ను గుర్తించిన పోలీసులు.. అన్ని మార్గాల్లో నిఘా పెట్టారు. అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని పట్టుకుంటామని, కేసు మిస్టరీని ఛేదిస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.