బంజారాహిల్స్/హిమాయత్నగర్: ఆగస్టు 15: ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డికి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్గౌడ్ మధ్య గొడవ జరిగింది. రామన్గౌడ్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హిమాయత్నగర్ విఠల్వాడీ సమీపంలోని శివాలయం వీధిలో స్థానిక బీజేపీ కార్యకర్తలు పంద్రాగస్టు సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో పాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మీ రామన్గౌడ్ను కూడా ఆహ్వానించారు. మంగళవారం ఉదయం జెండా ఆవిష్కరణకు వచ్చిన చింతల రాంచంద్రారెడ్డి.. స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మీ రామన్గౌడ్ రావడానికి రెండు నిమిషాల ముందే జెండా ఎగురవేయడంతో వివాదం రాజుకుంది. అక్కడికి వచ్చిన రామన్గౌడ్ తమను ఆహ్వానించిన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఆహ్వానించి అవమానిస్తారా.. అంటూ మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన రాంచంద్రారెడ్డి దుర్భాషలాడారు. దీంతో మాటా మాట పెరగడంతో తోపులాట జరిగింది. తనపై రాంచంద్రారెడ్డి, అతడి అనుచరులు దాడికి పాల్పడి, అవమానకరమైన రీతిలో మాట్లాడారంటూ రామన్గౌడ్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన రామన్గౌడ్ కింగ్కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో ఇలాంటి వైఖరి ఇటీవల పెరిగిపోయిందని, చింతలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
టికెట్ కోసం ప్రయత్నిస్తున్నందుకేనా?
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు తీవ్రంగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ టికెట్ తనకే అంటూ చింతల రాంచంద్రారెడ్డి చెప్పుకుంటుండగా.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పలువురు నాయకులు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నాయకుల్లో ఒకరైన రామన్గౌడ్ కూడా తనకు బీసీ కోటా కింద టికెట్ ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. ఇప్పటికే నియోజకవర్గం టికెట్ తనకే అంటూ కోట్లాది రూపాయలతో పలు కార్యక్రమాలు చేస్తున్న పల్లపు గోవర్ధన్తో పాటు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి తనయుడు బద్దం మహిపాల్ రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి తనయుడు ఇంద్రసేనారెడ్డితో పాటు మరికొంతమంది ఖైరతాబాద్ బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా.. హిమాయత్నగర్ డివిజన్లో చోటు చేసుకున్న ఈ వివాదంతో బీజేపీలో ఉన్న వర్గపోరు బట్టబయలయ్యిందని కార్యకర్తలు వాపోతున్నారు.