బంజారాహిల్స్, ఫిబ్రవరి 27: నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని సిగ్నలింగ్ వ్యవస్థ లేకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
బంజారాహిల్స్లోని ముగ్ద చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు ప్రధాన రహదారిపై మెగా ఇంజినీరింగ్ సంస్థ ద్వారా 6 పిల్లర్ల నిర్మాణం ప్రారంభమయిన సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సీపీ సజ్జనార్.. జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, ఎస్బీ విభాగం జాయింట్ సీపీ విజయ్కుమార్, ట్రాఫిక్ డీసీపీ కాజల్తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థ కోసం ఏడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నారన్నారు.
నగరంలోనే అత్యంత రద్దీ కలిగిన రహదారి కావడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను దశలవారీగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టనున్నారని వివరించారు. పగటి పూట ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రాత్రివేళలో ముమ్మరంగా పనులు కొనసాగుతాయని తెలిపారు. నిర్మాణ పనులు సాగుతున్న రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తవుతాయని, కేబీఆర్ పార్కుకు వచ్చే వాహనదారులు పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించడం ద్వారా పార్కింగ్ సమస్యలు లేకుండా చూసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మెఘా ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, ఎస్ఈ మోహన్రెడ్డి, ఈఈ సంపద, డీఈఈ హరీశ్, తదితరులు పాల్గొన్నారు.