Khairatabad Ganesh | అబిడ్స్: నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నాంపల్లి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం రాత్రి ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం.
మధ్యాహ్నం 1.30 కల్లా పూర్తవుతుందన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, సమితి కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్, సైబరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ పాల్గొన్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు అధునాతన ట్రయిలర్ను వినియోగిస్తున్నారు. వోల్వో ఇంజన్ కలిగిన బీఎస్ 6 వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 75 అడుగుల పొడవు, 11అడుగుల వెడల్పు కలిగిన ఈ వాహనాన్ని 26 టైర్లు ఉంటాయి. వంద టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
మహాగణపతి విగ్రహం సుమారు 70 టన్నుల బరువు ఉంటుందని శిల్పి రాజేంద్రన్ చెబుతున్నారు. పదకొండు సంవత్సరాలుగా స్వామి వారికి రథసారథిగా వ్యవహరిస్తున్న భాస్కర్రెడ్డి ఈ ఏడాది కూడా వాహనాన్ని నడుపుతారు. ఈ ట్రాయిలర్తో రోడ్డు ఎలా ఉన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా గణపతి విగ్రహాన్ని తరలించవచ్చని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచే గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగిస్తారు. రాత్రి 12గంటలకు కలశ పూజ నిర్వహించి విగ్రహానికి ఉద్వాసన పలికి శోభాయాత్రకు సిద్ధం చేస్తారు.