JEE Advanced | జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగింది. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ సెంటర్లో పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా సమాధానాలను తన స్నేహితులకు పంపించాడు. ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోయిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఎలాగైనా మంచి స్కోర్ చేయాలని అనుకున్నారు. ఇందుకోసం అడ్డదారి తొక్కారు. పరీక్షను పాసయ్యేందుకు స్మార్ట్ కాపీయింగ్ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం జరిగిన పరీక్షకు తెలివిగా తమ స్మార్ట్ ఫోన్లతో ఎగ్జామ్ సెంటర్కు హాజరయ్యారు. ఈ నలుగురిలో టాపర్ అయిన చింతపల్లి చైతన్య కృష్ణకు ప్యాట్నీలోని ఎస్వీఐటీ కాలేజీలో సెంటర్ పడింది. అక్కడ పరీక్ష రాసిన చైతన్య కృష్ణ.. ఆ సమాధానాలకు సంబంధించిన ఫొటోలను తమ వాట్సాప్ గ్రూప్లో ఫొటోలు పెట్టాడు. అవి చూసి ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న మిగిలిన విద్యార్థులు సమాధానాలు కాపీ చేసుకున్నారు. ఈ క్రమంలో చైతన్య కృష్ణపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ అతని దగ్గర వెతగ్గా స్మార్ట్ ఫోన్ లభించింది. దీంతో ఎగ్జామ్ సెంటర్లోని అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎగ్జామ్ హాల్కు వచ్చిన పోలీసులు చైతన్య కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా మిత్రులకు సమాధానాలు పంపించినట్లు గుర్తించారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్కు పాల్పడి పట్టుబడిన విద్యార్థి టాపర్ అని తెలుస్తోంది. అతనికి టెన్త్లో 600 మార్కులకు గానూ 600 మార్కులు వచ్చాయి. ఇంటర్లో వెయ్యి మార్కులకు గానూ 940 మార్కులు సాధించాడు. స్నేహితులకు సహాయపడాలనే ఉద్దేశంతో కాపీయింగ్కు పాల్పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చైతన్య కృష్ణ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.