Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల రాజ్యం కొనసాగుతోంది. విద్యార్థులు నిద్ర నుంచి మేల్కొనక ముందే హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి బలవంతంగా ముందస్తు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో హెచ్సీయూ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. హెచ్సీయూ భూములు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజాపాలన, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారెంటీ అని చెప్పి ఓయూను పోలీసు రాజ్యంగా మార్చి విద్యార్థుల స్వేచ్ఛ, హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదంటూ ఈనెల 13న జారీ చేసిన ఏకపక్ష, నియంతృత్వ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థులు లేవకముందే హాస్టల్ గదుల్లోకి వచ్చి వారిని బెదిరించి అరెస్టు చేస్తే అది ముమ్మాటికీ పోలీసు రాజ్యమేనని అన్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓయూలో ఇప్పుడు నడిచేది పోలీసుల రాజ్యమేనని ఉద్ఘాటించారు.