బంజారాహిల్స్, ఫిబ్రవరి 9: పాతకక్షల కారణంగా తనను ఎప్పుడైనా చంపేస్తాడన్న భయం ఒకరిది. తన ప్రియురాలిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న కోపం మరొకరిది. వారిద్దరూ కలిసి మరికొంత మంది స్నేహితులతో పాటు వచ్చి పక్కాగా ప్రణాళికను అమలు చేశారు. ఇద్దరు మహిళల సాయంతో హనీట్రాప్ చేసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్లో పుట్టా రాము అలియాస్ సింగోటం రామన్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ హరిప్రసాద్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ మేకల శ్రీనివాసులుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము అలియాస్ సింగోటం రామన్న (36) నిజాంపేటలోని బెవర్లీ ఫార్మ్స్ విల్లాలో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్లో హిమాంబీ అలియాస్ హసీనా అనే మహిళకు చెందిన భవనంలోని పెంట్హౌజ్లో పుట్టా రాము దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో వచ్చిన పదకొండు మంది వ్యక్తులు పుట్టా రామును హత్య చేసి పారిపోయారు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పుట్టా రాము హత్య కేసు దర్యాప్తు ప్రారంభించిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజీని సేకరించారు. హత్య అనంతరం 10 మంది పారిపోతున్న దృశ్యాలను సేకరించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హత్య జరిగిన ఇంట్లో ఉంటున్న హిమాంబీ (40)తో పాటు ఆమె కుమార్తె నసీమా(19)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హత్యకు ముందు మృతుడు రాముకు నసీమా నుంచి ఫోన్ కాల్స్ వెళ్లడంతో ఆమెను ప్రశ్నించగా వ్యవహారం మొత్తం బయటపడింది.
జీడిమెట్ల సమీపంలోని రాంరెడ్డినగర్కు చెందిన ఇందుగుల మణికంఠ అలియాస్ మణి(30), చింతల్కు చెందిన దరావత్ వినోద్కుమార్(29)తో సహా మొత్తం 11 మంది పుట్టా రాము హత్యలో పాల్గొన్నారని తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మణికంఠ, వినోద్కుమార్, మహ్మద్ ఖైసర్, కావలి శివకుమార్ అలియాస్ బండ శివ, కప్పల నిఖిల్తో పాటు హత్యకు ప్రోత్సహించిన పఠాన్ నసీమా, ఆమె తల్లి హిమామ్బీ అలియాస్ హసీనాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
సుమారు ఏడేళ్లుగా పుట్టా రాము, మణికంఠ, వినోద్కుమార్లకు పరిచయాలు ఉన్నాయని, వీరంతా ఎల్ఎన్నగర్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న హిమామ్ బీ అలియాస్ హసీనా ఇంటికి వచ్చి వెళ్తుంటారని తేలింది. పుట్టా రాము, మణికంఠ తదితరులంతా పేట్ బషీరాబాద్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో జువ్వా (అందర్ బాహర్ అనే పేకాట) నిర్వహిస్తుంటూ లక్షల్లో సంపాదించి జల్సాలు చేస్తుంటారని తేలింది. కాగా, తనతో పాటు ఉండాల్సిన మణికంఠ ఏడాదిన్నర క్రితం వేరుగా ముఠా ఏర్పాటు చేసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తుండటంతో పుట్టా రాముకు, మణికంఠకు గొడవలు జరిగాయి.
ఈ గొడవల్లో భాగంగా ఏడాది కిందట పుట్టా రాము తన గ్యాంగ్తో కలిసి మణికంఠపై దాడి చేయడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ ఘటనలో అరెస్టయిన పుట్టా రాము.. ఆ తర్వాత బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న మణికంఠ ఎలాగైనా రాము తనను చంపేస్తాడని, అతడిని చంపేస్తే తనకు ఎదురు ఉండదని భావించాడు. కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లి పది కత్తులు కొనుగోలు చేసి, అదును కోసం చూస్తున్నాడు.
పుట్టారామును ఒకవైపు మణికంఠ చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు ఎల్ఎన్నగర్లోని హిమాంబీతో శారీరక సంబంధం పెట్టుకున్న రాము.. ఆమె కుమార్తె నసీమాను కూడా లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం నసీమా ప్రియుడైన వినోద్కుమార్కు తెలిసింది. ఈ విషయాన్ని నసీమా, ఆమె తల్లి హిమాంబీ కలిసి మణికంఠకు, వినోద్కు చెప్పడంతో వారంతా కలిసి పుట్టా రామును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం బుధవారం రాత్రి నసీమా ఫోన్ చేసి.. పుట్టారామును గదికి రావాలని, కోరిక తీరుస్తానంటూ నమ్మబలికింది.
దీంతో ఎల్ఎన్నగర్కు వచ్చిన పుట్టా రాము గదిలోకి వెళ్లిన తర్వాత అప్పటికే సమీపంలోనే ఉన్న మణికంఠ, వినోద్తో సహా 11 మంది గదిలోనికి ప్రవేశించి.. నసీమా ముందే విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు. అతడి మర్మాంగాలను వినోద్ కోసేశాడు. అనంతరం అక్కడి నుంచే పుట్టా రాము గ్యాంగ్లోని ఓ వ్యక్తికి ఫోన్చేసి హత్య గురించి చెప్పారు. హత్యలో పాల్గొన్న 11 మంది నిందితులతో పాటు హత్యకు ప్రేరేపించిన పఠాన్ నసీమా, హిమాంబీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.