సిటీబ్యూరో/మన్సూరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో ప్రైవేట్ దవాఖానలో మెడికల్ అఫీసర్గా పనిచేస్తున్న ఓ నకిలీ వైద్యుడితో పాటు మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. సూర్యపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన కుదిలెట్టి విజయ్కుమార్ 2014లో నాగార్జున యూనివర్సిటీ నుంచి దూర విద్యావిధానంలో బీఎస్సీ చేశాడు. అనంతరం పలు ప్రైవేట్ దవాఖానల్లో కంపౌండర్, పీఆర్ఓగా పనిచేశాడు. మెడికల్ ఫీల్డ్లో పనిచేసిన అనుభవం ఉండటంతో డాక్టర్ అవతారం ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. రెండేండ్ల కిందట దిల్సుఖ్నగర్లోని సిగ్మ ఆసుపత్రిలో పీఆర్ఓ (పబ్లిక్ రిలేషన్ అఫీసర్గా పనిచేస్తుండగా అఫ్రోజ్ఖాన్తో పరిచయం ఏర్పడింది.
తనకు మెడికల్ ఫీల్డ్పై పట్టుందని, ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉంటే తాను వైద్యుడిగా ఉద్యోగం చేస్తానని తెలిపాడు. దీంతో అఫ్రోజ్ తన స్నేహితుడైన మహబూబ్ అలీ జునైద్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాడని అయితే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందంటూ చెప్పాడు. చివరకు రూ.6.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. రష్యాలోని కజన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్ను తీసుకున్నాడు. ఇందులో రూ.2 లక్షలు అఫ్రోజ్ కమిషన్గా తీసుకున్నాడు. కంప్యూటర్పై పట్టు ఉండటంతో జునైద్ కంప్యూటర్ నుంచి సర్టిఫికెట్ నమూనాను డౌన్లోడ్ చేసి దాన్ని పోలీనట్లు విజయ్కుమార్ పేరున నకిలీది తయారు చేశాడు. అలాగే రష్యాకు వెళ్లివచ్చినట్లు నకిలీ స్టాంప్లతో ఇమ్మిగ్రేషన్ సర్టిఫకెట్లు కూడా విజయ్కుమార్కు అందించాడు.
ఇదిలాఉండగా నకిలీ సర్టిఫికెట్తో విజయ్కుమార్ ఉప్పల్లోని కేర్ దవాఖానలో కొవిడ్-19 సమయంలో రూ.60వేల జీతంతో ఆరు నెలల పాటు పనిచేశాడు. తర్వాత మందమల్లమ్మ క్రాస్రోడ్డులో ఉన్న ఆర్కే దవాఖానలో ప్రస్తుతం డిప్యూటీ మెడికల్ అఫీసర్(ఎం.డీ) ఫిజీషియన్గా పనిచేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్, మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి బృందం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించింది. అతడు ఇచ్చిన సమాచారంతో మహబూబ్ అలీ జునైద్, అఫ్రోజ్ఖాన్ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి కూడా నకిలీ సర్టిఫికెట్లతో యూఏఈలో పనిచేస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ మురళీధర్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.