సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): నగరంలో 24 గంటలూ ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా పగలు, రాత్రి కూడా ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉంటున్నారు. ఇందుకు ట్రాఫిక్ పోలీసులు రోజూ 18 గంటలకు పైగానే రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని 35 ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటున్నది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయా కూడళ్లలో రాత్రి 12 గంటల వరకు విధుల్లో ఉంటూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. రాత్రి సమయంలో కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉండటంతో రోడ్డు ప్రమాదాలను కూడా కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని.. రాత్రి రెండు గంటలు, ఉదయం రెండు గంటల పాటు ట్రాఫిక్ సిబ్బంది విధులను తప్పని సరి చేశారు. అయితే, సాధారణ విధులలో ఉన్న సిబ్బంది, అదనపు సమయాల్లో ముఖ్య కూడళ్లలో పనిచేసే సిబ్బంది వేర్వేరుగా పని చేస్తున్నారు. నగరంలో 24 గంటలు ట్రాఫిక్ సాఫీగా వెళ్లాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఎన్ఫోర్స్మెంట్పై కాకుండా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపైనే పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. రాత్రి వేళల్లో జరిగే ఈ ప్రమాదాలను తగ్గించాలని పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
హైదరాబాద్లో రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్) విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కొందరు మాత్రమే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అలాంటి వారితోనే ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో రోడ్లపై ఎవరూ లేరనే భావనతో కొందరు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న అధికారులు.. రాత్రి వేళల్లోనూ ట్రాఫిక్ గస్తీని పెంచుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతోంది. దీంతో రాత్రి వేళల్లో వివిధ పనుల నిమిత్తం రోడ్లపై ప్రయాణాలు సాగించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే బస్సులు, భారీ వాహనాలు రాత్రి వేళల్లో నగరంలో నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో అర్ధరాత్రి కూడా రోడ్లపై వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటలకు ట్రాఫిక్ విధులకు వచ్చే సిబ్బంది రాత్రి 12 గంటల వరకు, ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సిబ్బంది అదనపు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం రాత్రి సమయంలో ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రధాన 35 కూడళ్లలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు క్రమబద్ధీకరణ, ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి పెట్టాం. రాత్రి వేళల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సిబ్బంది అదనంగా రాత్రి రెండు గంటలు, ఉదయం మరో రెండు గంటల పాటు ప్రధాన కూడళ్లలో విధుల్లో ఉంటారు. దీంతో రాత్రి వేళల్లో ర్యాష్ డ్రైవింగ్ తగ్గుతోంది. ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు రావు. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. రోప్ అమలుతో నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పెరిగింది. కొందరు తమ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని సమాచారం ఇస్తున్నారు. తమ సిబ్బంది వెళ్లి అక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. రోప్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై సిటీ పోలీస్ యాక్టుతో పాటు 341, 290, 283 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు.