దుండిగల్, మే 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరధ పోక్సో కేసు ఘటన మరువకముందే దుండిగల్ పీఎస్ పరిధిలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో దూరి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు మరోసారి తన మిత్రుడితో కలిసి బలత్కారానికి ఒడిగట్టాడు. నెలలుగా సాగుతున్న ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని, న్యూడ్ ఫొటోలు, వీడియోలు బహిర్గతం చేస్తామని బెదిరించడంతో ఇన్నాళ్ల భరించిన బాలిక ఇటీవల వేధింపులు అధికమవ్వడంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ డబుల్బెడ్ రూం ఇండ్లలో నివాసముంటున్న ఓ మైనర్ బాలిక(17)పై అక్కడే టెంట్హౌజ్లో పనిచేసే దారా శివకుమార్(20) అలియాస్ మట్టు అనే యువకుడి కన్నుపడింది. దీంతో కొంతకాలంగా బాలికను వెంబడిస్తున్న శివకుమార్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి, ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే నెలలో మరోసారి అదేతరహాలో బాలికపై బలాత్కారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని శివకుమార్ తన మిత్రుడు, పాతనేరస్థుడు అయిన దుండిగల్కే చెందిన నిజాంపేట్ రామ్(30) అలియాస్ రామ్ అనే వ్యక్తితో కలిసి అదే ఏడాది అక్టోబర్ నెలలో మరో రెండుసార్లు బాలికపై దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని, తమ వద్ద ఉన్న న్యూడ్ ఫొటోలు, వీడియోలను బయటపెడతామని బాలికను బెదిరించారు. దీంతో సదరు బాలిక తన బాధను పంటిబిగువున ఇన్నాళ్లు భరించింది.
అయితే ఇటీవల మళ్లీ శివకుమార్, రామ్ల నుండి వేధింపులు అధికమవడంతో భరించలేని బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాధిత కుటుంబం ఈనెల 17న దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడింది నిజమని తేలడంతో నిందితులు ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశారు. బుధవారం నిందితులను రిమాండ్కు తరలించారు. కాగా నిజాంపేట్ రామ్పై ఇప్పటికే దుండిగల్, బాచుపల్లి పీఎస్లలో దొంగతనం కేసులు, దుండిగల్ పీఎస్ పరిధిలో తల్లిదండ్రులను వేధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.