మోదీ పర్యటన నేపథ్యంలో హెచ్ఎంటీ కార్మికుల ధర్నా
సంఘీభావం తెలిపిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, మే 26 : కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులు కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు అమ్మేస్తూ.. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వకుండ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని ఉదృత్తం చేస్తామని హెచ్చరించారు. మాజీ కార్పొరేటర్ కేఎం.గౌరీశ్ గౌడ్, నాయకులు జయరాం, లక్ష్మారెడ్డి, రశీద్, కృష్ణగౌడ్, రషీద్ బేగ్, మల్లేశ్, సత్తిరెడ్డి, హెచ్ఎంటీ ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేవీ.రామారావు, కో ఆర్డినేటర్ పండరి, నాయకులు రవీందర్గౌడ్, నిరంజన్గౌడ్, రాములుగౌడ్, దేవేందర్, కేఎం.ప్రకాశ్, తులసీదాస్, పాల్గొన్నారు.