CM KCR | పీజేఆర్.. కేసీఆర్.. పరిచయం అక్కర్లేని పేర్లు. పార్టీలు వేరైనా.. మనసంతా పేదలపైనే. ఆలోచనలన్నీ గరీబోళ్ల బతుకులపైనే.. ఆనాడు బస్తీ ప్రజల స్థలాల కోసం పీజేఆర్ కొట్లాడితే.. అవే బస్తీల్లో నేడు కేసీఆర్ డబుల్ ఇండ్లు, తాగునీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రజల గుండెల్లో ఉన్న మట్టి మనిషి పీజేఆర్ చరిత్ర కనుమరుగుకు కాంగ్రెస్ కుట్ర చేస్తే.. ఆయన వారసుడు విష్ణువర్ధన్రెడ్డిని చేరదీసి సీఎం కేసీఆర్ పేదలకు భరోసానిచ్చారు. పీజేఆర్ ఆశయాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, విష్ణుకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ జోష్కు పీజేఆర్ చరిష్మా కూడా తోడు కావడంతో బస్తీల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. గ్రేటర్లోని పీజేఆర్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులందరూ కారెక్కేందుకు క్యూ కడుతున్నారు. తమను అక్కున చేర్చుకున్న కేసీఆర్కు బీఆర్ఎస్ను గెలిపించి రుణం తీర్చుకుంటామని పీజేఆర్ అభిమానులు ప్రతిమ బూనారు.
సిటీబ్యూరో/బంజారాహిల్స్, నవంబర్ 1 ( నమస్తే తెలంగాణ ) : నాడు పీజేఆర్.. గరీబోళ్లను గుండెల్లో పెట్టుకుని వారి సంతోషానికి కారణమయ్యాడు. నేడు పీజేఆర్ను గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ అభిమానులంతా పీజేఆర్ వారసుడి కోసం బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. పీజేఆర్ పేరును నగరం నుంచి విడదీయాలని కుట్రలు పన్నిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి పీజేఆర్ వెంట నడిచిన కాంగ్రెస్ శ్రేణులు సీఎం కేసీఆర్ బాట పట్టారు. దీంతో పీజేఆర్ చరిష్మా ఇప్పుడు బీఆర్ఎస్కు తోడు కావడంతో గ్రేటర్లో గులాబీ దళం మరింత దూకుడు పెంచింది. తమను అక్కున చేర్చుకున్న కేసీఆర్కు బీఆర్ఎస్ను గెలిపించి రుణం తీర్చుకుంటామని పీజేఆర్ అభిమానులు ప్రతిన బూనారు. పీజేఆర్ ఆశయాలన్నీ పేద ప్రజల కోసమే ఉండేవనీ.. ఆయన పేదోళ్లకు ఏదైతే మంచి చేయాలని కలగన్నాడో.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవన్నీ సాధ్యమయ్యాయని కేసీఆర్ సేవలను కొనియాడుతున్నారు. బీఆర్ఎస్లోకి రావడం పీజేఆర్తో కలిసి పనిచేసినట్టుగానే ఉందని ఆనాటి పీజేఆర్ వెంట ఉన్న నాయకులు చెబుతున్నారు. మొత్తంగా పీజేఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసిన సందర్భం.. కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నది.
ఆనాటి పీజేఆర్ ఆశయాలు తెలంగాణ ప్రభుత్వంలో నెరవేరాయి. గరీబోళ్లకు నీడ కల్పించాలని, తాగునీరు అందించాలని, వారి ఆరోగ్యం కోసం సరైన ఆసుపత్రులు నిర్మించాలని.. నాణ్యమైన విద్యుత్తు అందించాలని పీజేఆర్ కలగనేవాడు. అణగారిన వర్గాలకు అండగా ఉండాలని కోరుకునే పీజేఆర్కు సొంత పార్టీలోనూ అవమానాలు ఎదురయ్యాయి. అధికారంలో ఉన్నప్పటికీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. వాటిని పట్టించుకోకుండా గరీబోళ్ల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా ఆయన సేవలు అందించాడు. అయితే ఆనాటి పీజేఆర్ ఆశయాలన్నీ తెలంగాణ ప్రభుత్వంలో సాకరమవడం గొప్ప విషయమని పీజేఆర్ అభిమానులంతా చెబుతున్నారు. అత్యాధునిక హంగులతో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం, తాగునీరు, నిరంతర విద్యుత్తు, బస్తీ దవాఖానలు, కేసీఆర్ కిట్స్, పింఛన్లు ఇలా అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలోకి రావడం పీజేఆర్తో కలిసి పనిచేసిన అనుభూతినిస్తుందని చెబుతున్నారు.
దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టి ప్యారాచూట్ నేతలకు టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వారంతా బీఆర్ఎస్ పార్టీలోనే న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణ మొత్తంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన దివంగత మాజీ మంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీజేఆర్ అనుచరులంతా గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లోని పీజేఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్తో కలిసి పనిచేసిన సీనియర్ నేతలు సురేందర్యాదవ్, ఖదీర్, యాదగిరియాదవ్ లాంటి పలువురు నాయకులు విష్ణుతో పాటు బీఆర్ఎస్లోకి రావడం విశేషం.
హైదరాబాద్కు కృష్ణా జలాల తరలింపు, పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంపు తదితర అంశాల్లో సొంతపార్టీ ప్రభుత్వంతో పీజేఆర్ పోరాటం చేశారు. అసెంబ్లీ నుంచి ప్రారంభమైతే బీహెచ్ఈఎల్ దాకా, షేక్పేటలో ప్రారంభమైతే అల్వాల్ దాకా గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం విస్తరించి ఉండేది. ఫిలింనగర్లో 18 బస్తీలు, బంజారాహిల్స్ ప్రాంతంలోని అనేక బస్తీలు పీజేఆర్ హయాంలోనే ఏర్పడ్డాయి. మియాపూర్ సమీపంలోని హఫీజ్పేట, బోరబండ, కార్మికనగర్, రహ్మత్నగర్లోని పలు బస్తీలు పీజేఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పడ్డాయని స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కూకట్పల్లి నుంచి బాలానగర్ దాకా ఉన్న ప్రాంతంలో కూడా పీజేఆర్ చరిష్మా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉంది. ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఏర్పడిన అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా తాజా పరిణామాలతో పీజేఆర్ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు పీసీసీ అధ్యక్షుడు చేసిన కుట్రలతో ఆయా నియోజకవర్గాల్లోని పీజేఆర్ అనుచరులు, అభిమానులు సైతం బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బస్తీల్లో పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డితో ప్రచారం చేయించాలనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేవంత్రెడ్డి చేస్తున్న కుట్రలు నగరంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనంగా మార్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.