సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎల్అండ్టీ మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. మూడు కారిడార్లలో ఉన్న 65 మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల వాహనాల పార్కింగ్కు, అదేవిధంగా వారిని తీసుకువెళ్లేందుకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా ప్రతి మెట్రో స్టేషన్ వద్ద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో రైలు దిగిన వెంటనే క్యాబ్/ ఆటోలో వెళ్లేందుకు పికప్, డ్రాప్ పాయింట్ల వివరాల కోసం మెట్రో స్టేషన్పైకి వెళ్లే మార్గాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. నగర వాసులకు మెట్రో ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలుగా మెట్రో స్టేషన్లను తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 15 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తెరిచి కొవిడ్-19 నిబంధనలు పాటిస్తున్నారు. ప్రధాన మెట్రో స్టేషన్ల వద్ద ప్రైవేటు వాహనాలను నియంత్రిస్తూ, మెట్రో ప్రయాణికుల కోసం వచ్చి, వెళ్లే వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించడంపై దృష్టి సారించారు.