శారీరక లోపం మన ప్రతిభకు అడ్డు కాదని నిరూపించారు తెలంగాణకు చెందిన ప్రణీత్ అనే కుర్రాడు. అతని తమ్ముడు శౌర్య కూడా అన్నయ్య బాటలోనే నడుస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ జన్యుపరమైన లోపంతో జన్మించారు. అయినా విధికి ఎదురొడ్డిన ప్రణీత్ చెస్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. అనేక టోర్నమెంట్లలో బహుమతులు అందుకుంటున్నాడు. శౌర్య కూడా క్రీడల్లో ప్రతిభ చూపుతున్నాడు.
ఈ ప్రతిభను చూసిన బాగ్ లింగంపల్లిలోని సరోజినీ క్రికెట్ అకాడమీ ప్రణీత్ను సన్మానించింది. వీరితోపాటు తల్లిదండ్రులు కె.శ్రీనివాసరావు, పావని దంపతులను కూడా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సరోజినీ క్రికెట్ అకాడమీ సెక్రటరీ, నేషనల్ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు జి.ఆర్. కిరణ్, విశ్రాంత ఐఎస్ అధికారి, మాజీ మున్సిపల్ కమిషనర్ అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ప్రణీత్కు వీల్ చైర్లు అందజేశారు. ప్రణీత్ చూపించిన అకుంఠిత దీక్ష, పట్టుదల అనేక మందికి స్ఫూర్తిదాయకం అని, ముఖ్యంగా క్రీడాకారులు ఎలాటి పరిస్థితులు ఎదురైనా నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా పట్టుదలతో ముందుకు సాగాలని, అప్పుడే విజయం సొంతం అవుతుందని పేర్కొన్నారు.