మల్లాపూర్, జూలై 6 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో సమస్యలు లేకుండా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. గురువారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్నగర్, చాణక్యపురి కాలనీ, దత్తాత్రేయ నగర్, బాబానగర్, శక్తిసాయినగర్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, మంచినీటి లో ప్రెషర్, వీధి దీపాలు, తదితర సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. దత్తాత్రేయనగర్, శక్తిసాయినగర్ కాలనీలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను కోరారు.
త్వరలోనే జిమ్ ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇప్పటి వరకు వందశాతం అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా పెండింగ్లో ఉంటే గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలనీవాసులు ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక కార్పొరేటర్కు తెలుపాలని.. అప్పుడే ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సీఐ నందీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.