బడంగ్పేట, జనవరి 23 : బాలాపూర్ మండల పరిధిలో ఉన్న గొలుసు కట్టు చెరువులన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నదని, మండల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు నిరంతరం పాటుపడుతున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడి.. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వీలైనంత తర్వగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ కోసం హెచ్ఎండీఏ నిధులు ద్వారా మంజూరైన రూ. 4 కోట్ల నిధులతో చెరువు సుందరీకరణ పనులకు సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయిస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక విజన్తో పని చేస్తున్నారన్నారు. హైదరాబాద్లో మురికి కూపంగా ఉన్న దుర్గం చెరువును సుందరంగా తీర్చిదిద్ది.. పిక్నిక్ స్పాట్గా తీర్చిదిద్దిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో చెరువులు ఎక్కువగా ఉన్నాయని ఔట్లెట్ సమస్య రాకుండా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్కు వివరించడంతో చెరువుల అభివృద్ధికి ఎన్ని కోట్లయినా కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో మొదటి విడుతగా మీర్పేటకు సంబంధించిన పెద్ద ఔట్లెట్కు రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు.
ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ పైపులైన్ వేసి తాగు నీటి సమస్య పరిష్కారం కోసం కృష్ణ, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు 50 సంవత్సరాలకు నీటి సమస్య రాకండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ఊహించని విధంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం చెరువులన్నింటినీ సుందరీకరణ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్రెడ్డి, ఇరిగేషన్ డీఈ జగన్మోహన్, ఏఈ పద్మ, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బడంగ్పేట, జనవరి 23 : దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కళ్లెం నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్లోని దేవతలగుట్టపై ఏర్పాటు చేయబోయే 30 అడుగుల హనుమాన్ విగ్రహ ఏర్పాటుకు సోమవారం మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కందుకూరు, జనవరి 23 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని కొత్తూరు గేటు సమీపంలోని దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి రూ.10లక్షల కేటాయించారు. అనంతరం బోర్ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, గొరిగే రాజు, రవి ముదిరాజ్, డైరెక్టర్లు పొట్టి ఆనంద్, శేఖర్రెడ్డి, మాజీ డైరెక్టర్ సామ ప్రకాశ్రెడ్డి, మక్తాల వెంకటేశ్గౌడ్, ఈర్లపల్లి భూపాల్రెడ్డి, అలీ, నరేందర్గౌడ్, అంజద్, ఇందిరమ్మాదేవేందర్, దేశం కృష్ణారెడ్డి, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు షమీర్, దావుద్, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.