సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబరు 16(నమస్తే తెలంగాణ): రోజు రోజుకూ పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నగరంలో బండిలేనిదే సామాన్యుడు తన దైనందిన జీవనోపాధిని గడపలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాహనాన్ని పెట్రోలు బంకుకు తీసుకువెళ్లాలంటేనే జంకుతున్నారు. పెట్రోలుతో పాటు డీజిల్ ధరలు కూడా పోటీపడి మరీ పెరుగుతుండటంతో రవాణా వాహనాలు కూడా భారంగా ముందుకు కదులుతున్నాయి.
ఒకవైపు చమురు ధర ల పెంపు, వాటి ప్రభావంతో పెరుగుతున్న నిత్యావసర వస్తువు ల ధరలు వెరసి సామాన్యుడి జేబు ఖాళీ అవుతుంది. ప్రధానం గా పైసా పైసా పెంపుతో కేవలం ఐదు నెలల్లోనే లీటరు పెట్రోలుపై ధర రూ.11.37 పెరగ్గా, డీజిల్పై రూ.9.54 పెరుగుదల నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం కూడా నగరంలో పెట్రోలు ధర 0.36 పైసలు, డీజిల్ 0.42 పైసలు పెరిగింది.
రాష్ట్రంలో సుమారుగా నెలకు 13-15 కోట్ల లీటర్ల పెట్రోలు, డీజిల్ సుమారు 25 కోట్ల లీటర్ల వరకు విక్రయం జరుగుతుందని అంచనా. అయితే, కొన్ని రోజులుగా కరోనా, లాక్డౌన్ దరిమిలా 20 శాతం మేర అమ్మకాలు తగ్గాయని కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ (సీఐడీపీ) జాయింట్ సెక్రటరీ, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ మాజీ అధ్యక్షుడు రాజీవ్ అమ రం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 600కు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి.
వీటిల్లో రోజుకు సుమారు ఆరు లక్షల లీటర్లకు పైగా పెట్రోలు, దాదాపు 50 వేల లీటర్లకు పైగా డీజిల్ విక్రయం జరుగుతుంది. ప్రధానంగా నగరంలో విద్యార్థులు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారులు ఇలా ఒకరేమిటి! ప్రతి రంగంలోనూ సామాన్యుడు మొదలు ధనవంతుడి వరకు వాహనాలు లేనిదే రోజు గడవదు. అందుకే నగరంలో జనాభాకు మించిన వాహనాలు ఉన్నట్లుగా రవాణా శా ఖ రికార్డులే చెబుతున్నాయి.
ఈ క్రమంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అనేది ప్రతి ఒక్కరి మీదా ప్రభావం చూపుతుంది. దీనికి తోడు వస్తు రవాణాకు కూడా చమురు కీలకం కావడంతో వీటి ధరల పెంపు అనేది నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్ర భావం చూపుతుంది. పాలు మొదలు కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు నగరానికి చుట్టు పక్కల జిల్లాల నుంచే వస్తాయి. దీంతో నిత్యావసరాల ధరలనూ పెంచుతున్నారు.
ఆది నుంచి చమురు ధరలు పైసా పైసానే పెరుగుతున్నాయి. కానీ, నిర్విరామంగా పెరుగుతుండటంతో చివరకు వాహనదారుడి జేబుకు చిల్లు పడుతుంది. 2014 మే 13వ తేదీన హైదరాబాద్ నగరంలో లీట రు పెట్రోలు ధర రూ.78 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.61.80 ఉంది. శనివారం నగరంలో పెట్రోలు ధర లీటరు రూ.109.73 ఉం టే, డీజిల్ రూ.102.80గా ఉంది. అంటే, పెట్రోలుపై పెరుగుదల రూ.31.73 ఉండగా, డీజిల్పై పెరుగుదుల ఏకంగా రూ.41గా ఉంది. ఇక.. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ప్రతిరోజూ పైసా పైసా పెరుగుదల నమోదవుతూనే ఉంది. శనివారం వరకు ఈ ఒక్క నెలలోనే పెట్రోలు ధర లీటరుకు రూ.3.73, డీజిల్ ధర రూ.4.41కు పెరిగింది.