సిటీబ్యూరో: కేబీఆర్ పార్కు గేట్ నెంబరు 5 వద్ద ఉన్న అత్యంత ఖరీదైన స్థలాన్ని కుక్కల క్షవరం(గ్రూమింగ్) చేసే ‘పెట్ఫోక్’ అనే ప్రైవేట్ సంస్థకు జీహెచ్ఎంసీ కట్టబెట్టింది. సంబంధిత స్థలాన్ని చాలా నామమాత్రపు అద్దెకు ఇచ్చారు. పార్కుకు ఎదురుగా ఉన్న ప్రైవేట్ భవనాలకు చదరపు అడుగుకు నెలకు రూ.200ల చొప్పున అద్దె వసూలు చేస్తుండగా, జీహెచ్ఎంసీ మాత్రం 900 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు కేవలం రూ. 15వేల అద్దె చొప్పున ఏడాది కాలానికి కేటాయించింది. ఇటీవల ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఇక్కడే కొందరు ఎస్టేట్ విభాగం అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
ముఖ్యంగా ఎస్టేట్ విభాగంలో ఓ ఉన్నతాధికారి తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి బహిరంగ వేలం ద్వారా కేటాయించాలనే నిబంధనను తుంగలో తొక్కి నామమాత్రపు అద్దెకు అప్పనంగా కట్టబెట్టిన తీరుపై విమర్శలకు తావిస్తున్నది. పెంపుడు కుక్కలకు క్షవరం, మసాజ్ సేవలు అందించే ఈ సంస్థకు కాలిబాట పక్కన ఉన్న సుమారు రూ. 5కోట్ల విలులైన స్థలాన్ని నామమాత్రపు అద్దెకు కేటాయించారని వాకర్లు ఆరోపిస్తున్నారు.