మన్సూరాబాద్, నవంబర్ 26: చనిపోయిన పెంపుడు కుక్కల అంత్యక్రియలకు ఇక నుంచి ఇబ్బందులు ఉండవు. అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాలు మరణిస్తే ఎక్కడ పూడ్చాలో తెలియక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ, పీఎఫ్ఏ (పీపుల్ ఫర్ యానిమల్స్) అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఫతుల్లాగూడలోని యానిమల్ కేర్ సెంటర్ ప్రాంగణంలో కోటి రూపాయలతో పెంపుడు కుక్కల దహన వాటికను సిద్ధం చేశారు. ఇందులో జీహెచ్ఎంసీ షెడ్డు నిర్మాణ పనుల కోసం రూ. 60 లక్షలు, మిషనరీ కోసం పీఎఫ్ఏ సంస్థ రూ. 40 లక్షలు వెచ్చించింది.
పనులు దాదాపు పూర్తయ్యాయి. పది రోజుల్లో ఈ పర్యావరణ హిత దహనవాటికను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. పీఎఫ్ఏ సంస్థ ఐదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుందన్నారు. కాగా, పెంపుడు కుక్కల దహనం కోసం పీఎఫ్ఏ సంస్థకు రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు రూ. 500 చెల్లించి తమ పెంపుడు కుక్కల దహన సంస్కార కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. మరింత సమాచారం కోసం పీఎఫ్ఏ టోల్ఫ్రీ నంబర్: 73374 50643కు ఫోన్ చేస్తే తగిన సమాచారం ఇస్తారు.