CPR | బడంగ్పేట, మార్చి 10: తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు వచ్చేలోపే అపస్మారకస్థితిలో ఉన్న అతడికి సీపీఆర్ చేసి..ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి..నిండు ప్రాణాలను నిలిపిన పోలీసులను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్కు చెందిన జగన్ శనివారం అర్ధరాత్రి డయల్ 100కు ఫోన్ చేసి.. తాను ఉరివేసుకొని చనిపోతున్నట్లు చెప్పాడు.
వెంటనే అక్కడి సిబ్బంది మీర్పేట పోలీస్ స్టేషన్కు సమాచారాన్ని చేరవేశారు. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు సూర్యనారాయణ, నాగరాజు, రవి, హోంగార్డు నర్సింహలు హుటాహుటిన జగన్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఉరివేసుకొని వేలాడుతున్న జగన్ కొన ఊపిరితో ఉండటాన్ని గమనించి.. కిందకు దించారు. సీపీఆర్ చేసి.. ప్రాణాలు నిలిపారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ అధికారులు సైతం సిబ్బందిని ప్రశంసించారు.