మణికొండ, ఏప్రిల్ 30: జనావాసాల మధ్యలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన బ్లాస్టింగ్ వ్యవహారంలో ప్రముఖ గోద్రెజ్ నిర్మాణ సంస్థ పై స్థానిక పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం నామనామత్రపు కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 27న అర్థరాత్రి కోకాపేటలో జరిగిన భారీ పేల్లుళ్లలో చుట్టుపక్కల పది ఇళ్ల వరకు కంపించిపోవడం, ఇంటి సామగ్రి కిందపడిపోవడం, గోడలకు పగుళ్లు ఏర్పడటంతో ఒకింత అక్కడ భూకంపమే వచ్చిందా అన్న తీరుగా నిబంధనలను ఉల్లంఘించి బ్లాస్టింగులు జరిగాయి. అయితే ఇప్పటివరకు బాధ్యులపై కఠిన చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన తీవ్రతకు తగ్గట్టుగా ఎక్స్ప్లోసివ్స్ చట్టం ఉల్లంఘనలు, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే సెక్షన్లు నమోదు చేయాల్సి ఉండగా, కేవలం కంటి తుడుపు చర్యలతో వ్యవహారం ముగించే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా నిర్మాణ సంస్థతో అంతర్గత ఒప్పందాలు జరిగాయన్న ప్రచారం కూడా స్థానికంగా వినిపిస్తోంది.
కోకాపేటలో ఇటీవల జరిగిన భారీ బ్లాస్టింగ్ పేలుళ్లపై ప్రజలు మండిపడుతున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకున్నాం అంటూ ‘గోద్రెజ్ నిర్మాణ సంస్థ వర్గాలు చెప్పుకోవడం దాన్ని ఆధారంగా చేసుకుని స్థానిక పోలీసులు కేవలం నామమాత్రపు కేసు నమోదు చేసి వ్యవహారాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం జనవాసాల మధ్య బ్లాస్టింగ్ చేపట్టాలంటే కఠిన భధ్రతా ప్రమాణాలు, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు, ప్రమాద నివారణ చర్యలు తప్పనిసరి, కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అనుమతులు ఉన్నాయి అనే కారణంతో కామ్ ఇన్ఫ్రా ప్రైవేట్ సంస్థ ప్రతినిధి ఖాజా మోహినుద్దీన్ నిర్లక్ష్యంగా పేలుళ్లు జరిపించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు కోరుతున్నారు.