సబితా ఇంద్రారెడ్డి
పహాడీషరీఫ్, మార్చి 17 : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి, వరదనీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ వార్డులో రూ. 7.40 కోట్లతో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంక్, పైపులైన్ ఏర్పాటుకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇంటింటికీ మంచి నీరు అందివ్వాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో రూ. 72 కోట్లతో పనులను ప్రారంభించామని వెల్లడించారు. ఈ నేప థ్యంలో తూర్కాలనీలో 60 లక్షల లీటర్ల సామ ర్థ్యం గల వాటర్ట్యాంకును నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. వర్షం వచ్చినప్పుడల్లా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 15 కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ఇబ్బందుల నుంచి ప్రజలను తప్పించడానికి రూ. 10 కోట్లకు పైగా నిధులు కేటాయించి నాలాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
వైద్యానికి సంబంధించిన సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా నాలుగు బస్తీ దవఖానలు ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. పహాడీషరీఫ్, కొత్తపేట, షాహీన్నగర్, శ్రీరామకాలనీలలో ఏర్పాటు చేసే బస్తీ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యం అందిస్తారన్నారు. బస్తీ దవాఖాన ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పా రు. చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి. కుమార్, కౌన్సిలర్లు జాఫర్బామ్, శంషొద్దీన్, కెంచె లక్ష్మీనారాయణ, కో – ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఇక్భాల్ బిన్ ఖలీఫా, షేక్ అప్జల్, వాసుబాబు, బర్కత్ అలీ పాల్గొన్నారు.